
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ఖమ్మం లీగల్: పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా భావించాలని న్యాయసేవా సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి చంద్రశేఖరరావు సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం న్యాయ సేవా సంస్థ కార్యాలయం ఆవరణలో చంద్రశేఖరరావు, మొబైల్ కోర్టు న్యాయమూర్తి నాగలక్ష్మి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతా ఆరోగ్యం ఉండడం, పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది మువ్వా నాగేశ్వరరావు, న్యాయ సేవా సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.
డ్రోన్లు, ఈవీల మరమ్మతుల్లో మహిళలకు శిక్షణ
ఖమ్మంఅర్బన్: ఐటీఐ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులకు ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణం ఆధ్వర్యాన తొలిసారి డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల మరమ్మతుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మేనేజర్ వేల్పుల విజేత తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఐటీఐ సర్టిఫికెట్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, మూడు ఫొటోలు జత చేసిన దరఖాస్తులను టేకులపల్లిలోని మహిళా ప్రాంగణంలో ఈనెల 9నుంచి 12వరకు అందజేయాలని సూచించారు. నెల పాటు శిక్షణ కోసం ప్రతీ ట్రేడ్లో ముప్ఫై మందిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని ఆమె తెలిపారు. కాగా, డ్రోన్ మరమ్మతుల శిక్షణకు ఏదైనా ట్రేడ్లో ఐటీఐ, ఈవీ మెకానిక్ శిక్షణకు డీజిల్ మెకానిక్ ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్హులైన వారు అర్హులని మేనేజర్ వెల్లడించారు.
నిరంతర సరఫరా కోసం కొత్త ట్రాన్స్ఫార్మర్లు
బోనకల్: మెరుగైన విద్యుత్ సరఫరా కోసం అవసరమైన చోట్ల కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేయిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల ఫోరం(సీజీఆర్ఎఫ్) చైర్పర్సన్ ఎన్.వీ.వేణుగోపాలాచారి తెలిపారు. బోనకల్ రైతు వేదికలో శుక్రవారం నిర్వహించిన ఫోరం సదస్సులో ఆయన పాల్గొన్నారు. రావినూతల, చొప్పట్లుపాలెం గ్రామాల రైతులు తమ సుబాబుల్ తోటల మీదుగా 11 కేవీ విద్యుత్ లైన్ వెళ్తుండడంతో గాలిదుమ్ము వచ్చినప్పుడు సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు. అలాగే, మరికొందరు అదనపు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుపై వినతిపత్రాలు అందజేశారు. అనంతరం వేణుగోపాలాచారి మాట్లాడుతూ వినియోగదారులు సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసమావేశంలో ఫోరం సభ్యులు కె.రమేష్, చరణ్దాస్, ఎం.రామారావు, వైరా డీఈ బి.శ్రీనివాసరావు, ఏడిఈ పి.కిరణ్కుమార్, ఏఈలు సుందర్కుమార్, సాయికుమార్, టి.మనోహర్, ఎస్ఏఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలను గావించారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత