
రెండోరోజూ విధుల బహిష్కరణ
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కార్మికులు మరోమారు విధులు బహిష్కరించారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలనే డిమాండ్తో కొన్నాళ్ల క్రితం మూడు రోజుల పాటు విధులు బహిష్కరించగా, ఒక నెల వేతనం చెల్లించిన అధికారులు సర్దిచెప్పడంతో విధుల్లో చేరారు. మళ్లీ ఇప్పుడు మూడు నెలల వేతనం బకాయి పడడంతో గురువారం నుంచి నిరవధిక సమ్మెకు ఉపక్రమించారు. వీరి సమ్మెతో ఆస్పత్రికి వచ్చే సాధారణ రోగులు, ఇన్ పేషంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఓపీ చీటీల నమోదు, ఓపీలో వైద్యులకు సహాయకారిగా, ఆపరేషన్ థియేటర్, క్యాజువాలిటీ సేవల్లో వీరే కీలకంగా వ్యవహరిస్తుండగా సమ్మె కారణంగా ఇతరులను నియమించగా అనుభవలేమితో జాప్యం జరిగింది. దీంతో శుక్రవారం ఓపీ నమోదు వద్ద చీటీల జారీ ఆలస్యం కావడంతో క్యూ అంతకంతకు పెరిగింది. కాగా, వైద్య విధాన పరిషత్ నుంచి డీఎంఈ పరిధిలోకి ఆస్పత్రి వెళ్లాక తరచుగా వేతనాల సమస్య ఎదురవుతోంది. వీవీపీ పరిధిలో ఉన్నప్పుడు ఆస్పత్రిలో 575 పడకలకు అనుమతి ఉండడంతో 259 మంది కార్మికులను ఏజెన్పీ ద్వారా విధుల్లోకి తీసుకున్నారు. ఆపై డీఎంఈ పరిధిలోకి చేర్చాక 430 పడకలకే అనుమతి ఇవ్వడం, అంతకు ముందు మాదిరిగానే వేతన బడ్జెట్ విడుదల చేస్తుండడం సమస్యకు కారణమైంది. గతంలో ఒక్కోసారి ఏజెన్సీ బాధ్యులు సొంత నగదు చెల్లించినా, ఇప్పుడు వారికే రూ.2.50 కోట్లు బకాయి ఉండడంతో వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని సమాచారం. కాగా, కార్మికుల సమ్మెతో శుక్రవారం మున్సిపల్ కార్మికులతో శుభ్రం చేయించినా పెద్దగా ఫలితం కానరాలేదు.
వేతనాల కోసం పెద్దాస్పత్రి కార్మికుల నిరసన