
ప్రజల్లో నమ్మకం పెంచేలా వైద్యసేవలు
● సీహెచ్సీలో తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ శ్రీజ ● హాజరు పట్టికలో ఉద్యోగుల తప్పుడు సంతకాలపై సీరియస్
తిరుమలాయపాలెం: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచేలా వైద్యులు, సిబ్బంది వైద్యసేవలందించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. తిరుమలాయపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం తనిఖీ చేసిన ఆమె చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. ఆతర్వాత ఫార్మసీ, పరీక్ష గది, ఆస్పత్రిలో మందుల నిల్వలు, గర్భిణులకు అందుతున్న సేవలు, పరీక్షలపై ఆరా తీశారు. గర్భిణులకు మెరుగైన వైద్యం అందిస్తూ సాధారణ ప్రసవాలకు ప్రోత్సహించాలని వైద్యులకు సూచించారు.
డ్యూటీలో లేకున్నా సంతకాలా?
ఆస్పత్రిలో ఉద్యోగుల హాజరు రికార్డు పరిశీలించగా విధుల్లో లేని డాక్టర్ల సంతకాలు ఉండడంతో అదనపు కలెక్టర్ శ్రీజ మండిపడ్డారు. డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్కు ఫోన్ చేసి వైద్యులు గైర్హాజరవుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అలాగే, రాత్రి సమయాన పీహెచ్సీకి సిబ్బంది, దంత వైద్యుడికి డ్యూటీ వేయడంపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సక్రమంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజలకు వైద్యం అందించాలని సూచించారు. తల్లీపిల్లల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె తెలిపారు. డాక్టర్లు అమర్సింగ్, సురేష్, ప్రదీప్రెడ్డి, హారిక తదితరులు పాల్గొన్నారు.