
జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన
ఖమ్మంవన్టౌన్/ముదిగొండ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8గంటలకు ముదిగొండ మండలం యడవల్లిలో రూ.4.75కోట్ల నిధులతో చేపట్టనున్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రాజగోపురం, ముఖ మండపం, గెస్ట్హౌస్, ఆర్చి పునర్నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ఈమేరకు యడవల్లిలో శంకుస్థాపన ఏర్పాట్లను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. కాంగ్రెస్ జిల్లా, మండల అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రమేష్తో పాటు మందరపు నాగేశ్వరరావు, కందిమళ్ల వీరబాబు పాల్గొన్నారు.
మంత్రి తుమ్మల..
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 5–30గంటలకు ఖమ్మం 20వ డివిజన్ ప్రకాష్నగర్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత వైరా రోడ్డులోని అంబేద్కర్భవన్లో ఏర్పాటు చేసిన మహిళామార్ట్ను ప్రారంభిస్తారు.
సబ్సిడీపై పచ్చిరొట్ట
విత్తనాలు
రఘునాథపాలెం: భూసారాన్ని పెంచేందుకు ఉపయోగపడే పచ్చిరొట్ట విత్తనాలను సబ్సి డీపై ఇస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య సూచించారు. రఘునాథపాలెం మండలంలోని వీ.వీ.పాలెం సొసైటీలో మంగళవారం పలువురికి విత్తనాలు అందజేశాక ఆయన మాట్లాడారు. ఈ విత్తనాలతో పంట సాగు చేసి కలియదున్నడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈకార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రావూరి సైదబాబు, ఏఓ ఉమామహేశ్వరరెడ్డి, ఏఈఓ లు సాయిశిరణ్మయి, దివ్య, సీఈఓ ఐతగాని తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
మహిళా క్లినిక్లో
మెరుగైన సేవలు
ఖమ్మంవైద్యవిభాగం: మహిళా ఆరోగ్య క్లినిక్ ద్వారా మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని డీఎంహెచ్ఓ బి.కళావతి బాయి తెలిపారు. ఖమ్మం పాత మున్సిపాలిటీ కార్యాలయంలోని క్లినిక్ను మంగళవారం సందర్శించిన ఆమె ఓపీ సేవలు, మందుల లభ్యతపై ఆరా తీశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ జిల్లాలోని పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా రిఫర్ చేసే వారికి ప్రతీ మంగళవారం పరీక్షిస్తూ చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం పల్లె దవాఖానా, కోర్టు సముదాయంలోని ప్రభుత్వ డిస్పెన్సరీ కూడా డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు.

జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన