మరింత వేగంగా ధాన్యం కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

మరింత వేగంగా ధాన్యం కొనుగోళ్లు

May 1 2025 1:13 AM | Updated on May 1 2025 1:13 AM

మరింత వేగంగా ధాన్యం కొనుగోళ్లు

మరింత వేగంగా ధాన్యం కొనుగోళ్లు

ఖమ్మంసహకారనగర్‌: యాసంగి పంటల కొనుగోళ్లలో వేగం పెంచాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి బుధవారం ఆయన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ డీ.ఎస్‌.చౌహాన్‌తో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న 15–20 రోజులు ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా పర్యవేక్షించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు ధాన్యం కాంటా వేయిస్తూ మిల్లులకు తరలించాలని సూచించారు. కొన్ని రకాల ధాన్యాన్ని నిరాకరించడమే కాక తరుగు తీస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా నుంచి వీసీకి కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, శ్రీనివాసరెడ్డి, డీఆర్డీవో సన్యాసయ్య, డీసీఎస్‌ఓ చందన్‌కుమార్‌, డీఎం శ్రీలత, డీఎంఓ అలీమ్‌, డీసీఓ గంగాధర్‌ హాజరయ్యారు.

రైతులకు ఇబ్బందులు ఎదురుకావొద్దు

ధాన్యం సేకరణ విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో తహసీల్దార్లతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ నిర్దేశిత తేమ రాగానే ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించడమే కాక ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. కేంద్రాల వద్ద ఇంకా 22వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉన్నట్లు తెలుస్తుండగా, వేగం పెంచాలన్నారు. విద్యుత్‌ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ శ్రీలత, డీసీఓ గంగాధర్‌, ఆర్డీఓ రాజేందర్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

చేగొమ్మలో రాస్తారోకో

కూసుమంచి: మండలంలోని చేగొమ్మ సొసైటీ పరిధిలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు బుధవారం ఖమ్మం–సూర్యాపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రహదారిపై చెట్ల కొమ్మలు అడ్డుగా వేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈమేరకు ఏఓ వాణి, ఎస్సై నాగరాజు చేరుకుని రైతులతో మాట్లాడారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కొనుగోళ్లు చేపడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, రైతుల ఇబ్బందులను సీపీఎం నాయకులు కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వివరించగా ఆయన అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచడంతో పాటు సరిపడా గన్నీబ్యాగ్‌లు సమకూర్చాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement