
అతిథిలా నటించి దోచుకెళ్లాడు..!
● కళ్యాణ మంటపంలో దొంగ చేతివాటం
హుబ్లీ: కళ్యాణ మంటపంలోకి అతిథిలా వచ్చి అక్కడ ఉన్న విలువైన వస్తువులను చోరీ చేసి పరారైన వ్యక్తిపై గోకుల్ రోడ్డు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ దొంగలా వచ్చిన వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు. అయితే అతడు గోకుల్ రోడ్డు కళ్యాణ మంటపానికి అతిథిగా వచ్చి మంటపంలోని విలువైన వస్తువులను దోచుకొని పరారయ్యాడు. ఈ దొంగ చేతివాటం ప్రదర్శించిన దృశ్యాలు కళ్యాణ మంటపంలోని సీసీ కెమెరాలో నమోదయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులకు పెళ్లి నిర్వాహకులు, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు దాఖలు చేసుకున్న గోకుల్ రోడ్డు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా ఇక్కడి మంటూరు రోడ్డు అరళికట్టి కాలనీలో జరిగిన మట్టి దిబ్బ కూలిన కేసులో కాంట్రాక్టరు, సహ కాంట్రాక్టరు నిర్లక్ష్యం కారణంగా, బాధ్యత లేకుండా సదరు పనులు చేపట్టడంతో మృతి చెందిన కార్మికుడు చేతన్ యాదవ్ సోదరుడు హుబ్లీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కాంట్రాక్టర్ అంజాద్ గిరణితో పాటు మరో సహ కాంట్రాక్టర్పై కేసులు నమోదు చేశారు.
ప్లాస్టిక్ వ్యర్థాలతో
తారు రోడ్డు నిర్మాణం
●జాతీయ స్థాయిలో
నగర పాలికెకు ప్రశంసలు
హుబ్లీ: తారు రోడ్డు నిర్మాణంలో నిషేధిత ప్లాస్టిక్ వ్యర్థ ఉత్పత్తులను వినియోగిస్తూ హుబ్లీ ధార్వాడ నగర పాలక సంస్థ చేపట్టిన వినూత్న ప్రక్రియకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. పర్యావరణ దినం సందర్భంగా ఢిల్లీలోని భారత్ మంటపంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణంలో మార్పుల శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాలికె చేపట్టిన ఈ వినూత్న ప్రక్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. గట్టిదనంతో కూడి సుస్థిరమైన రోడ్డు నిర్మాణంలో నిషేధిత ప్లాస్టిక్ వాడకంపై వీడియోను టీపీటీ ద్వారా ప్రదర్శించారు. దీంతో సదరు కార్యక్రమ ఆవరణలో పాలికెకు ఓ అంగడి సముదాయాన్ని కేటాయించారు. అక్కడ ప్రజలకు ప్రయోగాత్మకంగా రోడ్డు నిర్మాణంలో నిషేధిత ప్లాస్టిక్ వాడకం విధానాన్ని వివరించారు. దీంతో అక్కడ వీక్షించిన ప్రముఖులు పాలికె ఈ కొత్త ప్రయోగానికి అభినందనలు తెలియజేఃశారు. ప్లాస్టిక్ లేని జంట నగరాలు అనే లక్ష్యంగా పాలికె చేస్తున్న కృషిని దేశ రాజధానిలో గుర్తించారు. ఈ సందర్భంగా పాలికె మేయర్ రామప్ప బడిగేర్, కమిషనర్ డాక్టర్ రుద్రేష్ గాళి, అడిషనల్ కమిషనర్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాలికె ఈ విప్లవాత్మక కృషిపై స్థానిక మీడియాలో బాగా ప్రచారం లభించడంతో ఢిల్లీలో ఈ ఘనత సాధించినట్లు స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
నా తమ్ముడికి న్యాయం
చేయండి
హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని హెబ్బళ్లి జెడ్పీ సభ్యుడు యోగీష్ గౌడ హత్య కేసులో సాక్షులు నిజం చెప్పడం ద్వారా తన తమ్ముడికి న్యాయం దొరికేలా చేయాలని హతుడి సోదరుడు గురునాథగౌడ విజ్ఞప్తి చేశారు. స్థానిక మీడియాతో ఆయన శనివారం మాట్లాడారు. ధార్వాడ గ్రామీణ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన రిట్ను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఆ మేరకు బెయిల్ రద్దు అయింది. సాక్షులపై ఒత్తిళ్లు పెంచారు. పోలీస్ అధికారులు కూడా ఒత్తిళ్లకు గురయ్యారు. సీబీఐ నివేదిక తర్వాత ఈ కేసు విషయంలో సాక్షుల నాశనానికి ప్రయత్నించారని సమర్పించిన రిట్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి తాజాగా ఆదేశాలను వెల్లడించిందన్నారు. ఈ హత్యోదంతంపై నిరంతరం పోరాడుతున్న బసవరాజ్ కొరవర మాట్లాడుతూ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి తమ పలుకుబడిని ఉపయోగించి సాక్షులపై ఒత్తిళ్లు తేవడం కోర్టు గమనించి సీబీఐ సమర్పించిన రిట్ను స్వీకరించిందన్నారు. సాక్షులపై ఒత్తిళ్లు చేసిన నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దు అయిందని, ఆ మేరకు ఆయన లొంగుబాటుకు సుప్రీంకోర్టు 7 రోజుల గడువును ఇచ్చిందన్నారు. సత్యానికి గెలుపు, విజయం లభించింది. యోగీష్ గౌడ హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, సాక్షులపై ప్రభావం చూపించడం సరికాదు. సాక్షులు స్వేచ్ఛగా నిజాలు వెల్లడించాలన్నదే సుప్రీంకోర్టు ఆశయం అన్నారు.
పర్యావరణంపై ప్రజలను
జాగృతి చేయాలి
కోలారు : పరిసరాల నాశనం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలను జాగృతం చేయాలని సమాజ సేవకుడు సీఎంఆర్ శ్రీనాథ్ అన్నారు. నగరంలోని స్కౌట్స్ అండ్ గైడ్స్, వంశోధయ ఆస్పత్రి, కోలారు రోటరీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విశ్వ పరిసర దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోడ్లు తదితర అభివృద్ధి పనుల పేరుతో వృక్షాలను తొలగిస్తున్నారని, దీని వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందన్నారు. దీనిని గుర్తించి ప్రతి ఒక్కరు మొక్కలను విరివిగా పెంచి పోషించాలన్నారు. అనంతరం పరిసర దినోత్సవంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కమిషనర్ కేవీ శంకరప్ప, రోటరీ నందిని అధ్యక్షుడు వీ బాబు, సురేష్బాబు, ఉమాదేవి, దంత వైద్యురాలు పంకజ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

అతిథిలా నటించి దోచుకెళ్లాడు..!