
టైర్ పేలి కారు పల్టీ.. ఒకరు దుర్మరణం
రాయచూరు రూరల్: కారులో ప్రయాణిస్తుండగా టైర్ పేలడంతో కారు బోల్తా పడి ఒకరు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని లింగసూగూరు తాలూకాలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతుడిని అమరేశ్వర క్రాస్ నుంచి దేవర భూపురకు కారులో వెళుతున్న తిమ్మనగౌడ(32)గా పోలీసులు గుర్తించారు. నిశ్చితార్థం ముగించుకుని వస్తుండగా ఈ దుర్ఘటన సంభవించినట్లు తెలిసింది. లింగసూగూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బావిలో పడి ఇద్దరు దుర్మరణం
రాయచూరు రూరల్: గొర్రెలను మేపడానికి వెళ్లిన ఇద్దరు గొర్రెల కాపరులు కాలు జారి బావిలో పడి దుర్మరణం పాలైన ఘటన కలబుర్గి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కలబుర్గి జిల్లా చిత్తాపుర తాలూకాలో జరిగిన ఈ ఘటనలో మృతులను కుశాల్ చెన్నప్ప(8), రాజు చెన్నప్ప(14)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చిత్తాపుర పోలీసులు తెలిపారు.
రాజ కాలువల్లో పూడికతీత
రాయచూరు రూరల్: నగరంలోని రాజ కాలువలు, మురుగు కాలువల్లో పేరుకున్న చెత్త, పూడికతీతను జిల్లా స్థాయి అధికారులు గురువారం సాయంత్రం పరిశీలించారు. బస్టాండ్ వద్ద గల పెద్ద కాలువలో పూడికతీతను జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే, కమిషనర్ జుబిన్ మహాపాత్రో పరిశీలించి మాట్లాడారు. కాలువల్లో పూడికను తొలగిస్తే వర్షాకాలంలో నీరు సజావుగా ముందుకు వెళతాయన్నారు. పూడికను తొలగించకుంటే వర్షపు నీరు నిల్వ చేరి లోతట్టులోని ఇళ్లలోకి జొరబడతాయన్నారు. ప్రజలు ఇబ్బంది పడరాదని గమనించి వారి శ్రేయస్సు దృష్ట్యా పూడికను తొలగింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
9 నుంచి పక్షవాత
పరీక్ష శిబిరం
హుబ్లీ: హెల్త్ గార్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 9 నుంచి 14 వరకు సంతోష్నగర్ నీలకంఠేశ్వర కాంప్లెక్స్లోని డాక్టర్ విజయ్ కాట్వే క్లినిక్లో పక్షవాతంపై ఉచిత వైద్య పరీక్ష చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అత్యాధునిక చికిత్సా పద్ధతుల ద్వారా నిపుణులైన వైద్యులతో రోగులను పరీక్షిస్తారు. అలాగే మెదడు, వెన్నెముక, పక్షవాతం, మూర్ఛరోగం తదితరాల పరీక్షలను కూడా జరుపుతారన్నారు. పేర్ల నమోదుకు సెల్ నంబర్–9731280586లో సంప్రదించాలని నిర్వాహకులు ఓ ప్రకటనలో కోరారు.
నకిలీ బ్రాండ్తో చీపుర్ల తయారీ.. కేసు నమోదు
హుబ్లీ: విభవ కంపెనీ మంకీ 555 బ్రాండ్ పేరుతో చీపుర్లను నకిలీ పద్ధతిలో తయారు చేసి విక్రయిస్తున్న ఆరోపణలపై జైన్ మార్కెటింగ్ అంగడిపై కేసు నమోదైంది. మంగళవారపేటెలోని జైన్ మార్కెటింగ్ అంగడితో పాటు పలువురికి వ్యతిరేకంగా కేసులు నమోదయ్యాయి. సదరు కంపెనీ జీఎం వినోద్ కుమార్ జవళి ఈ ఫిర్యాదు చేశారు. నుల్వి గ్రామంలో విభవ కంపెనీ పేరుతో మంకీ 555 బ్రాండ్ చీపుర్లను తయారు చేసిన కార్మికుడు గౌడప్పగౌడ నుంచి 60 చీపుర్లను కొనుగోలు చేసి పరిశీలించగా ఈ నకిలీ తయారీ గుట్టురట్టయింది. ఈ ఘటనపై గంటిగేరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా విశ్రాంత ఉద్యోగి ఎస్ఎండబ్ల్యూయూ అబ్రాయ్ అనే కంపెనీలో రూ.3.20 లక్షల పెట్టుబడి పెట్టి మోసపోయారు. స్థానికుడు కన్ననగౌడ ఈయననే గాక తనూష, కార్తీక, హబీద్సింగ్లను కూడా మోసగించినట్లు బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భక్తిప్రపత్తులతో ధ్వజారోహణ
బళ్లారిఅర్బన్: శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీపార్శ్వనాథ్ జైన్ శ్వేతాంబర్ ఆలయంలో 101వ ధ్వజారోహణను ఆచార్య విమల్ సాగర్ సారథ్యంతో భక్తిప్రపత్తులతో వేద ఘోషల మధ్య నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ తుకారాం, జిల్లా ఎస్పీ శోభారాణి, శ్రీపార్శ్వనాథ్ జైన్ శ్వేతాంబర్ సంఘం అధ్యక్షుడు ఉత్సవ్లాల్ బాగ్రేచా, ఉపాధ్యక్షుడు సూరల్మల్ దంతెవాడి, ప్రధాన కార్యదర్శి రోషన్ జైన్, సహ కార్యదర్శి అనిల్ బాగ్రేచా, సంయుక్త కార్యదర్శి భరత్, ట్రెజరర్ గౌతమ్ బుజ్వాన్, వినోద్ బాగ్రేచా, మహావీర్, హర్ష జైన్, అజయ్ సోని, దేవస్థాన పదాధికారులు, జైన్ ప్రముఖులు, సమాజ బాంధవులు పాల్గొన్నారు.

టైర్ పేలి కారు పల్టీ.. ఒకరు దుర్మరణం

టైర్ పేలి కారు పల్టీ.. ఒకరు దుర్మరణం