
10 నుంచి ముంగారు ఉత్సవాలు
రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 10వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అఖిల భారత ముంగారు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఏ.పాపారెడ్డి వెల్లడించారు. ఆదివారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 25 ఏళ్ల నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఎద్దుల పోటీల్లో భాగంగా ఈనెల 10న కర్ణాటక ఎద్దుల ఒకటిన్నర టన్నుల రాతి దూలం లాగే పోటీలను జిల్లా ఇన్చార్జి, వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ ప్రారంభిస్తారన్నారు. 11న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఎద్దుల రెండు టన్నుల బరువుగల రాతిదూలం లాగే పోటీలను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కాశీ జగద్గురువులు, 12న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఎద్దుల రెండున్నర టన్నుల బరువైన రాతి దూలం లాగే పోటీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభిస్తారన్నారు. 11న లక్ష్మీదేవి జాతర, ఎద్దుల ఊరేగింపు, కళా బృందాలతో ఉత్సవం జరుగుతుందన్నారు. 8 నుంచి ప్రతి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామన్నారు. 5న సద్భావన యాత్ర, కవిగోష్టులు, 6న రంగుల పోటీలు, 7న సేవకులకు సన్మానం, 8న వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో బసవరాజరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శంకర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
11న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య
12న హాజరు కానున్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
25వ ఏడాది పోటీలకు
ముఖ్యమంత్రుల రాక