
సమర్థకు రాష్ట్రస్థాయి ద్వితీయ ర్యాంక్
హుబ్లీ: ధార్వాడ కేఈ బోర్డు ఆంగ్ల మాధ్యమ హైస్కూల్ విద్యార్థి సమర్థ ఉమర్జి 10వ తరగతి పరీక్షల రీవాల్యుయేషన్లో 624 మార్కులు సాధించి రాష్ట్రానికి ద్వితీయ, జిల్లాకు ప్రథమ స్థానంలో నిలిచారు. తొలుత వెల్లడైన ఫలితాల్లో సమర్థకు 619 మార్కులు మాత్రమే వచ్చాయి. అనంతరం రీవాల్యుయేషన్ జరపగా గణితంలో 80, ఇంగ్లిష్లో 79 మార్కులు సాధించి తన ప్రతిభను చాటాడు. కాగా తొలుత వెల్లడైన ఫలితాల మేరకు గణిత శాస్త్రంలో 76, ఇంగ్లిష్లో 78 మార్కులు వచ్చాయి అంటే ఇంగ్లిష్లో 1 మార్కు, గణిత శాస్త్రంలో అదనంగా మరో 4 మార్కులు సాధించాడు. కాగా రీవాల్యుయేషన్లో పలు విద్యార్థుల మార్కులు గణనీయంగా పెరగడం గమనార్హం.
బురదమయంగా
ఏపీఎంసీ మార్కెట్
హొసపేటె: వర్షం కారణంగా ఏపీఎంసీ మార్కెట్ బురదమయంగా మారడంతో అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో వినియోగదారులు, వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. గతవారం నుంచి నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ప్రజలకు తీవ్ర ఇబ్బందిని కలిగించింది. నగరంలోని ఏపీఎంసీ మార్కెట్ పూర్తిగా చిత్తడిగా మారడంతో వినియోగదారులకు, వ్యాపారులకు నానా ఇబ్బందులు తలెత్తాయి. భారీ వర్షం కారణంగా వ్యాపారులు, వినియోగదారులు వర్షంలోనే వ్యాపారాలు నిర్వహించడం కనిపించింది. ఉదయం కురిసిన భారీ వర్షం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు నరకయాతన పడ్డారు.
మహిళ కడుపులో
2 కేజీల గడ్డ తొలగింపు
● చిటగుప్పి ఆస్పత్రి వైద్య బృందం ఘనత
హుబ్లీ: వాణిజ్య నగరి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో హుబ్లీ ధార్వాడ సిటీ కార్పొరేషన్ నిర్వహణలోని చిటగుప్పి ఆస్పత్రి తాజాగా ఓ ఘనత సాధించింది. ఓ మహిళ కడుపులోని సుమారు 2 కేజీల బరువైన గడ్డను ఆపరేషన్ చేసి వైద్యులు తొలగించారు. ఉన్న స్వల్ప సౌకర్యాలతోనే ఈ క్లిష్టకరమైన ఆపరేషన్ చేసి మహిళకు పునర్జన్మ ప్రసాదించారు. మహిళలకు సురక్షితమైన కాన్పులు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఈ ఆస్పత్రి పేరుగాంచింది. ప్రస్తుత ఆస్పత్రి ముఖ్య వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ దండెప్పనవర్ నేతృత్వంలో ఫైబ్రాయిడ్ చికిత్స కోసం దాఖలైన మహిళకు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. సదరు మహిళ రక్తహీనతతో బాధపడుతుండేది. దీంతో ఆమెకు నిస్సత్తువ, నడవడానికి వీలు కాని పరిస్థితి ఉండేది. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకపోవడంతో చివరికి ఈ ఆస్పత్రిలో చేరారు. ఈమెను పరీక్షించగా కడుపులో గడ్డ ఉండడాన్ని గుర్తించిన వైద్య బృందం ఆమెకు ఒకటిన్నర గంట పాటు ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యంగా ఉంది.
ముందు జాగ్రత్తే డెంగీకి మందు
హొసపేటె: ప్రజల సహకారం, ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా మాత్రమే డెంగీ కట్టడి సాధ్యమని జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ మహమ్మద్ అక్రమ్ అలీ షా తెలిపారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సహకారంతో నిర్వహించిన జాతీయ డెంగీ దినోత్సవ జాతాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ శాఖల ప్రయత్నాలతో మాత్రమే వ్యాధి వ్యాప్తిని, అనారోగ్యాన్ని నివారించడం అసాధ్యమని అన్నారు. డెంగీకి టీకా లేదా యాంటీ వైరల్ చికిత్స ద్వారా నివారణ తమకు ఉన్న ఉత్తమ ఎంపిక అన్నారు. డెంగీ వ్యాధి ఏడిస్ దోమలు పగటి పూట కుట్టడం వల్ల కలిగే వైరల్ వ్యాధి అన్నారు. డెంగీకి సకాలంలో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే దీనిని నివారించవచ్చన్నారు. జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ శంకర్నాయక్ మాట్లాడుతూ గత సంవత్సరం 314 డెంగీ జ్వరాల కేసులు నమోదయ్యాయన్నారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అన్నారు. ఈఏడాది ప్రారంభంలో 14 కేసులు గుర్తించామన్నారు. ఈ సందర్భంగా వైద్యులు జంబయ్య, భాస్కర్ పాల్గొన్నారు.
ఎల్ఎల్సీపై దారి నిర్మించండి
హొసపేటె: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర ఎల్ఎల్సీ కాలువ ఎడమ గట్టుకు ఆనుకుని ఉన్న భూమి దగ్గర ఒక పెద్ద గుంట ఏర్పడింది. దీని వల్ల ఎల్ఎల్సీ కాలువ ప్రమాదంలో పడింది. ఈ సంఘటన విజయనగర జిల్లాలోని నాగేనహళ్లి గ్రామ సమీపంలో జరిగింది. భారీ వర్షపు నీటి ప్రవాహం కారణంగా ఎల్ఎల్సీ కాలువ దగ్గర రహదారి పూర్తిగా మూసుకుపోయింది. ఎద్దుల బండ్లు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కాలువకు అడ్డుగోడ నిర్మించాలని 2020 నుంచి రైతులు పలుమార్లు ఈ విషయంపై తుంగభద్ర బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ఈనేపథ్యంలో అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి త్వరలో సమస్యను పరిష్కరించక పోతే టీబీ బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతు సంఘం నేత గాళెప్ప హెచ్చరించారు.

సమర్థకు రాష్ట్రస్థాయి ద్వితీయ ర్యాంక్

సమర్థకు రాష్ట్రస్థాయి ద్వితీయ ర్యాంక్