
మాజీ మంత్రి వీరకుమార్ పాటిల్ కుమారుడు అరెస్ట్
దొడ్డబళ్లాపురం: వరకట్న వేధింపులతోపాటు మహారాష్ట్రలో సంచలనం కలిగించిన వైష్ణవి హత్య కేసులో నిందితులకు ఆశ్రయం కల్పించినట్లు ఆరోపణలపై మాజీ మంత్రి వీరకుమార్ కుమారుడు ప్రీతమ్ను పుణె పోలీసులు అరెస్టు చేశారు. వైష్ణవిని ఆమె మామ రాజేంద్ర, మరిది సుశీల్ హత్య చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీరిపై కేసు నమోదుకాగా అరెస్టు కాకుండా ప్రీతమ్ ఆశ్రయం కల్పించడంతోపాటు ఆర్థిక సాయం చేశారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. హత్య కేసులో నిందితులు అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీ పార్టీలో ముఖ్య నేతలు కావడం వల్ల ఈ కేసు మహారాష్ట్రలో సంచలనంగా మారింది.
మైసూరులో చైన్ స్నాచింగ్
మైసూరు: మైసూరులో చైన్ స్నాచింగ్ జరిగింది. విద్యారణ్యపురంలో నివాసముంటున్న శారదమ్మ తన భర్త సుబ్రమణ్యశెట్టితో కలిసి దశరథ గుప్తుడి ఇంటికి వెళ్లింది. తిరిగి వస్తుండగా విద్యారణ్యపుర నాల్గవ ప్రధాన రోడ్డు సమీపంలో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు శారదమ్మ మెడలోని రూ.3.50లక్షల విలువైన బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
టోయింగ్ వల్ల సమస్యలు వస్తే రద్దు చేస్తాం
● హోంమంత్రి పరమేశ్వర్
దొడ్డబళ్లాపురం: నో పార్కింగ్లో ఉన్న వాహనాలను టోయింగ్ చేసే విధానాన్ని సమస్యగా భావిస్తే రద్దు చేస్తామని హోంమంత్రి జీ పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం సదాశివనగర్లో తమ నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ మండ్యలో జరిగిన సంఘటన బాధాకరమని, ఈ వ్యవహారంలో ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశామని, ఈ సంఘటనకు సంబంధించి అధికారులతో సమావేశమై చర్చిస్తానన్నారు. ట్రాఫిక్ పోలీసుల వైఖరి క్షమించరానిదన్నారు. ఈ విషయంలో పోలీసులను హెచ్చరించి పలు సూచనలు చేశామన్నారు.
మునిరత్నపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
● డీసీఎం డీకే శివకుమార్
శివాజీనగర: ‘ముత్యాలు, రత్నాలను బీజేపీ వారే ఉంచుకోవటంలో తమకు అభ్యంతరం లేదు. అయితే మునిరత్నను ఎందుకు సస్పెండ్ చేయలేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రశ్నించారు. మంగళవారం కేపీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎస్.టీ.సోమశేఖర్, హెబ్బార్ విధానసౌధలో ఎవరినీ రేప్ చేయలేదు. హెచ్ఐవీ ఇంజెక్షన్ పొడిచారా? అని ప్రశ్నించారు. మునిరత్నపై చాలావరకు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. తనిఖీలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష నాయకులకు ఇంజెక్షన్ ఎక్కించేందుకు వెళ్లారు. యడియూరప్పను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని డీసీఎం డీ.కే.శివకుమార్ ప్రశ్నించారు.