
పాక్పై తగిన సమయంలో నిర్ణయం
హుబ్లీ: పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఏం చర్యలు తీసుకోవాలో, వాటిని తగిన సమయంలో కేంద్రం తీసుకుంటుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషి తెలిపారు. సోమవారం ఆయన అసెంబ్లీలో విపక్ష ఉప నేత అరవింద బెల్లదతో కలిసి మీడియాతో మాట్లాడారు. భారత్ చర్యలతో ఇప్పటికే పాక్ అల్లాడి పోతోందన్నారు. తగిన సమయంలో తగిన చర్యలు తప్పనిసరిగా జరుగుతాయని ఆయన హామీ ఇచ్చారు. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తగినట్లుగా పూర్వ సిద్ధతా పథకాలు అవసరం అవుతాయన్నారు. ఈ విషయంలో భారత్ సర్కారు తీర్మానమే అంతిమమన్నారు. ప్రధాని, రక్షణ మంత్రి ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. పాక్కు వ్యతిరేకంగా సరిహద్దుల్లో యుద్ధానికి వెళతానన్న మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ముందుగా ప్రశాంతంగా ఉంటే చాలు, దేశంలో మన మిలిటరీ ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటుందన్నారు. మీరు ప్రశాంతంగా, సమాధానంగా ఉంటే దేశం ముందడుగు వేస్తుందన్నారు.
సీఎం వ్యాఖ్యలకు ఖండన
మహదాయి పథకంపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందన్న సీఎం ఆరోపణలపై మాట్లాడుతూ సిద్దరామయ్య తప్పుడు సమాచారాన్ని తీసుకుంటున్నారన్నారు. ఈ విషయంలో మేం అడిగిన ఏ ప్రశ్నలకు సీఎం సమాధానం ఇవ్వలేదన్నారు. మా ప్రశ్నలకు జవాబులను ఆయన మళ్లిస్తున్నారు. మహదాయికి డీపీఆర్, పర్యావరణ అనుమతి కూడా ఇప్పించాను. అయితే వన్యప్రాణుల మండలి నుంచి సమస్య తలెత్తిందన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టులో ఉందన్నారు. గోవా వన్యప్రాణుల మండలి అక్కడ ఏ పనీ చేయరాదని ఆదేశాలు వెల్లడించిందన్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రశ్నించిందన్నారు. మేము దీన్ని డిస్మిస్ చేయాలని కోరామన్నారు. ఇప్పటి వరకు మహదాయి గురించి మీరు ఏం చేశారని జోషి కాంగ్రెస్ నేతలను నిలదీశారు. కాగా హుబ్లీలో రూ.180 కోట్ల నిధులతో లోహియ నగర్లో స్మార్ట్ సిటీ పథకం ద్వారా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామన్నారు. ఇక్కడ వాలీబాల్, ఖోఖో, త్రోబాల్, ఫుట్బాల్, స్మిమ్మిగ్, రన్సింగ్ ట్రాక్ తదితర 19 ఆటలకు సౌకర్యం కల్పిస్తామన్నారు. స్మార్ట్ సిటీ గడువు ముగిసినా కూడా నిర్మాణ పనులు ప్రగతి పథంలో ఉండటంపై సంబంధిత అధికారులకు కేంద్ర మంత్రి తగిన సూచనలు ఇచ్చారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషి