
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
హుబ్లీ: ధార్వాడ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. లారీ ఢీకొని రోడ్డు దాటుతున్న యువకుడు స్థలంలోనే మృతి చెందిన ఘటన ధార్వాడ తాలూకా నరేంద్ర క్రాస్ వద్ద చోటు చేసుకుంది. మృతుడిని నవలగుందకు చెందిన బసవరాజ మహదేవప్ప పల్లెద(19) అనే యువకుడిగా గుర్తించారు. బసవరాజ్ రోడ్డు దాటుతున్న వేళ లారీ ఢీకొన్నట్లు ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అలాగే మరో ఘటనలో ఆటోను గూడ్స్ లారీ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ధార్వాడ తాలూకా తళవాయి, కనకూరల మధ్య రోడ్డులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతి చెందిన యువకుడిని హుబ్లీ తాలూకా అంచటగేరి గ్రామానికి చెందిన ప్రకాష్ భీమప్ప వాలికార్ (23)గా గుర్తించారు. ఆటో రిక్షాలో యల్లమ్మనగుడ్డ సన్నిధికి వెళ్లి తిరిగి వస్తుండగా మినీ గూడ్స్ లారీ ఆటోను ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రకాష్ను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. అలాగే ఆటోలో ఉన్న మరో ఇద్దరు మహిళలు కూడా గాయపడ్డారు. వీరిని ధార్వాడ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
బాలికపై అత్యాచారం..
పోక్సో కేసు నమోదు
హుబ్లీ: ఽదార్వాడ శ్రీరామనగర్లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఆరోపణలపై ఓ వ్యక్తికి వ్యతిరేకంగా పోక్సో కేసు నమోదైంది. మత్తు పదార్థాలను కొనుగోలు చేసి విక్రయిస్తున్న కడేదప్ప శృంగేరి(52) అనే వ్యక్తి పదేళ్ల బాలికను మాయమాటలతో మభ్య పెట్టి గోడౌన్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఘటనపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ముఖ్యాధికారిపై సస్పెన్షన్ వేటు
హొసపేటె: హొసపేటె తాలూకా మరియమ్మనహళ్లి పట్టణ పంచాయతీ ముఖ్యాధికారి ఖాజా మొహిద్దీన్ను ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో విధుల నుంచి సస్పెండ్ చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ డైరెక్టర్ ప్రభులింగ కావలికట్టి ఉత్తర్వులు జారీ చేశారు. అసలు యజమానులకు తెలియకుండా కృత్రిమ పత్రాల సృష్టి, ఆస్తి అకౌంటింగ్, పురావస్తు శాఖ బావి స్థలాల సీల్ చేయడం, అండర్ రైట్ చేసిన అనేక ప్రభుత్వ ఆస్తులకు నకిలీ పత్రాలను సృష్టించడం ద్వారా ఆయన ప్రభుత్వాన్ని మోసం చేశారని తేలడంతో శాఖాపరమైన విచారణను రిజర్వ్ చేసి, తక్షణమే ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు.
మురుగు కాలువలో నవజాత శిశువు మృతదేహం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా చంద్రశేఖరపుర గ్రామంలో మురుగు కాలువలో నవజాత శిశువు మృతదేహం బుధవారం సాయంత్రం లభించింది. ఎవరో మహిళ కాన్పు సమయంలో మగబిడ్డ చనిపోయాడనే విషయాన్ని దాచి పెట్టే ప్రయత్నంలో శిశువు మృతదేహాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు కాలువలో ఒక శిశువు మృతదేహం ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గుడేకోటె పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
ముగ్గురు దుర్మరణం
రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లాలోని అఫ్జల్పుర తాలూకా కె.గబ్బూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన చోటు చేసుకుంది. మృతులను కలబుర్గిలోని మిల్లత్ కాలనీ వాసులుగా పోలీసులు గుర్తించారు. కలబుర్గి నుంచి మహారాష్ట్ర సరిహద్దులోని హైదర్ దర్గాకు బంధువులతో కలిసి టవేరా వాహనంలో బయలు దేరారు. గబ్బూరు వద్ద వాహనానికి అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అయిషా(70), అజ్మీర్(30), జైనబ్(2)లు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పంచనామా కోసం కలబుర్గిలోని జిమ్స్కు తరలించారు. దేవల గాణగాపుర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామాల్లో ఇళ్ల పంపిణీకి డిమాండ్
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ పథకం(పీఎంజీఎస్వై)లో ఇళ్లు పంపిణీ చేయాలని నమ్మ కర్ణాటక సేనె సంఘం జిల్లాధ్యక్షుడు కొండప్ప డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అధికారులు ఇష్టానుసారంగా ఉన్న వారికే ఇళ్లను కేటాయిస్తున్నారని ఆరోపించారు. జీపీఎస్ను చేయడానికి అధికారులు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు లంచాలు తీసుకుంటున్నారన్నారు. నిజమైన లబ్ధిదారులకు కాకుండా అనర్హులకు అధిక శాతం కేటాయించారని ఆరోపించారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి