
కిడ్నాప్ కలకలం
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడిన వివాదం ఒకరి కిడ్నాప్నకు దారితీసింది. రెండు రోజుల క్రితం కిడ్నాప్ జరుగగా ఆలస్యంగా వెలుగుచూసింది. సంచలనం సృష్టించిన కిడ్నాప్ సంఘటన వివరాలు ఎస్సై గణేశ్, బాధితుల కథనం ప్రకారం. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరుకు చెందిన జంపెల్లి పర్శరాములు రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ కోనరావుపేట మండలానికి చెందిన వ్యక్తితో జరిగిన ఆర్థిక లావాదేవీలలో వివాదం ఏర్పడింది. ఈక్రమంలోనే ఏడాది క్రితం పర్శరాములు స్వగ్రామం గూడూరుకు వచ్చాడు. తిరిగి ఉపాధి కోసం మలేషియా వెళ్లాడు. అయితే పర్శరాములుకు తమకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, ఆ డబ్బులు ఇవ్వాలంటూ కొందరు ఏడాది క్రితం తమను బెదిరించారని పర్శరాములు తల్లి మల్లవ్వ తెలిపింది. గత సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి బెదిరించారని పేర్కొంది. ఈనేపథ్యంలోనే మంగళవారం ఉదయం తన భర్త మల్లయ్య కనిపించకుండా పోయాడని తెలిపింది. మల్లయ్య కోసం గాలించిన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై గణేశ్ సోమవారం అర్ధరాత్రి గూడూరుకు వచ్చిన వ్యక్తులపై ఆరా తీశారు. ప్రత్యేక బృందాలను నియమించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో కిడ్నాపర్లు కోరుట్లలోని ఓ ఇంట్లో ఉన్నట్లు బుధవారం మధ్యాహ్నం కనిపెట్టారు. కిడ్నాపర్లు ఉన్న ఇంటిపై దాడి చేయగా.. ప్రధాన సూత్రధారులైన ఇద్దరు పరారైనట్లు సమాచారం. మల్లయ్యతోపాటు అక్కడే ఉన్న మరో ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మల్లయ్య క్షేమంగా ఉన్నాడని, వైద్యపరీక్షలు చేయిస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. కాగా కిడ్నాపర్ల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పర్శరాములు తల్లి మల్లవ్వ, భార్య గీత ఆరోపించారు. డబ్బు విషయంలో ఏర్పడిన వివాదం తమకు తెలియదన్నారు. పర్శరాములు తండ్రి మల్లయ్యను కిడ్నాప్ చేయడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. దుబాయ్లో ఏం జరిగింది.. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై విచారణ చేస్తున్నామన్నారు.
గల్ఫ్లో ఆర్థిక లావాదేవీల్లో వివాదం
గూడూరులో కుటుంబ పెద్ద కిడ్నాప్
కోరుట్లలో పట్టివేత
పోలీసుల అదుపులో ఇద్దరు కిడ్నాపర్లు
ఆలస్యంగా వెలుగుచూసిన వ్యవహారం

కిడ్నాప్ కలకలం