
జీపీవో ప్రక్రియ ముమ్మరం
● జూన్ 2లోగా నియమాకానికి చర్యలు ● పరీక్ష మూల్యాంకన బాధ్యత రెవెన్యూకే
కరీంనగర్ అర్బన్:
గ్రామ పాలన అధికారుల నియామక ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గతంలో గ్రామస్థాయిలో వీఆర్వో, వీఆర్ఏ ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం మారడంతో ధరణిని తొలగించి భూ భారతిని తీసుకురాగా గ్రామంలో పాలన అధికారి ఉండాలని నిర్ణయించింది. ఆసక్తి గల వీఆర్వో, వీఆర్ఏల నుంచి దరఖాస్తులు స్వీకరించగా రెండ్రోజుల క్రితం పరీక్ష నిర్వహించారు. జూన్ 2లోగా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మూల్యాంకన బాధ్యత రెవెన్యూదే
జీపీవో పరీక్షల మూల్యాంకన బాధ్యత రెవెన్యూశాఖ నిర్వహించనుంది. పరీక్షకు 205మంది దరఖాస్తు చేసుకున్నారు. 79మంది వీఆర్వోలు దరఖాస్తు చేయగా అందులో 8 తిరస్కరించారు. 126 మంది వీఆర్ఏలు దరఖాస్తు చేయగా ఆరు తిరస్కరించారు. సస్పెన్షన్ అయినవారు, కోర్టు కేసులు, ఏసీబీ కేసులున్నవారిని తిరస్కరించారు. పలువురు తహసీల్దార్లతో కమిటీని ఏర్పాటు చేసి మూల్యంకనం చేయనున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30 మార్కులు, ఇతరులకు 35 మార్కులు వస్తేనే పాస్గా పరిగణించనుండగా.. జీపీవోగా నియామకం కానున్నారు.
క్షేత్రస్థాయి సమస్యలకు వారధి
గతంలో ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉండే వీఆర్వోల దృష్టికి తీసుకెళ్లేవారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని రెవెన్యూ అధికారులకు వివరించి పరిష్కారమయ్యేలా చేసేవారు. సదరు పరిస్థితి లేకపోవడంతో గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు పేరుకుపోయాయి. పరిస్థితిని గమనించిన ప్రభుత్వం తిరిగి ఊరికో గ్రామ పాలనాధికారి(జీపీవో)ని ని యమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే పూర్వం వీఆర్వో విధులు నిర్వహించి వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న 191 మంది వీఆర్వోలు పని చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశా రు. ఈ క్రమంలో 172 మంది పరీక్ష రాయగా అర్హులను జీపీవోలుగా నియమించనున్నారు.
మరో 33మంది అవసరం
జిల్లాలో 318 పంచాయతీలున్నాయి. ఇందులో 205 రెవెన్యూ గ్రామాలుగా ఉండగా పరీక్ష రాసినవారిని తీసుకున్నా 172మంది మాత్రమే ఉన్నారు. వీరిలో కూడ పాస్ మార్కులు వచ్చినవారినే తీసుకోను న్నారు. మరో 33 మంది అవసరం కాగా తొలి విడతలో నియమించే వారికే ఇతర గ్రామాల అదనపు బాధ్యతలైనా అప్పగించాలి. లేదంటే ఇతర ప్రభు త్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న వారిని నియమించాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
జిల్లాలో మొత్తం గ్రామాలు: 318
రెవెన్యూ గ్రామాలు: 205
రెవెన్యూ డివిజన్లు: 02
మండలాలు: 16
సాగు విస్తీర్ణం: 3,46,063ఎకరాలు