
స్వగ్రామానికి శ్రీనివాస్ మృతదేహం
ధర్మపురి: దుబయిలో పాకిస్థానీ యువకుడి చేతిలో ఈనెల 11 హత్యకు గురైన మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరింది. శ్రీనివాస్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కంటతడి పెట్టారు. అంత్యక్రియల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ పాల్గొన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆయన కుటుంబానికి ఎన్ఆర్ఐ పాలసీ కింద రూ.5లక్షలతోపాటు కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి రూ.25లక్షలు ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, గ్రామస్థులు తదితరులున్నారు.