
తాగు, సాగునీటి కోసం ‘చలో నారాయణపూర్’
● ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్రూరల్: సాగు, తాగునీటి కోసం త్వరలో చలో నారాయణపూర్ పేరిట పాదయాత్ర చేపట్టనున్నట్లు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలి పారు. శుక్రవారం కరీంనగర్ మండలం దుర్శేడ్, మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్, జూబ్లీనగర్, నగునూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వం ఎస్సారెస్పీ నీటిని సక్రమంగా విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోయినట్లు తెలిపారు. తాగు, సాగునీటి కోసం నారాయణపూర్ రిజర్వాయర్ వరకు పాదయాత్ర చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. బొమ్మకల్కు రైసుమిల్లులు కేటాయించడంతో దూరమవుతుందని రైతులు చెప్పడంతో కలెక్టర్తో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. కరీంనగర్, దుర్శేడ్ సహకార సంఘాల అధ్యక్షులు పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, తోట తిరుపతి, వైస్ చైర్మన్ గోనే నర్సయ్య, ఎంపీడీవో సంజీవరావు, ఏవో సత్యం, సీఈవోలు ఎం.రమేశ్, వేణుమాధవ్, మాజీ ప్రజాప్రతినిధులు జక్కం నర్సయ్య, దబ్బెట రమణారెడ్డి పాల్గొన్నారు.