
రత్నగిరికి పోటెత్తిన భక్తజనం
● ఆలయం వద్ద నవ దంపతుల సందడి
● ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు
అన్నవరం: జ్యేష్ట శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి కిక్కిరిసింది. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు భక్తులతో నిండిపోయాయి. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరిపై జరిగిన వివాహాలతో నవదంపతులు, వారి బంధుమిత్రులతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల కూడా అవే ముహూర్తాలలో వివాహాలు చేసుకున్న భక్తులు రత్నగిరికి వచ్చి వ్రతాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా స్వామివారి వ్రతాలు 2,500 జరిగాయి. శుక్రవారం అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు తులసి దళాలతో సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం వేదపండితులు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. ఈ పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నర్శింహమూర్తి, అర్చకులు సుధీర్, పరిచారకులు పవన్ తదితరులు నిర్వహించారు.
నేడు తిరుచ్చి వాహనంపై సత్యదేవుని ఊరేగింపు
సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను శనివారం తిరుచ్చి వాహనంపై ఊరేగించనున్నారు. ఉదయం పది గంటలకు ఈ ఊరేగింపు ప్రారంభం కానుంది.