
జీడిపండుకు మూడు గింజలు!
మలికిపురం: మండలంలోని పడమటిపాలెం గ్రామంలో అంబటి లక్ష్మీనారాయణకు చెందిన జీడి తోటలో ఒక చెట్టుకు కాసి న జీడిపండుకు మూడు గింజలు ఉన్నాయి. సాధారణంగా ఒక పండుకు ఒకే గింజ ఉంటుంది. కానీ ఇక్కడ మూడు గింజలు ఉండటం స్థానికులను ఆశ్చర్యపరచింది.
ఇంటర్ ఫీజు చెల్లింపునకు 5 వరకూ అవకాశం
అమలాపురం టౌన్: ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఈనెల 12 నుంచి 20వ తేదీ వరకూ జరగనున్న అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపునకు రెండు రోజులు గడువు పెంచినట్లు డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. కొంతమంది విద్యార్థులకు మరికొంత సమయం ఇస్తే ఫీజు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని ఇంటర్మీడియెట్ బోర్డు దృష్టికి వెళ్లినట్లు డీఐఈవో స్పష్టం చేశారు. దీంతో విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు చివరి అవకాశంగా ముందు నిర్దేశించిన ఈనెల 3వ తేదీని 5వ తేదీ వరకూ రెండు రోజుల పాటు పెంచినట్లు ఆయన వివరించారు. ఈ గడువు పెంపుతో పాటు ఆ లోపు ఫీజు చెల్లించే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా చెల్లించే అవకాశాన్ని బోర్డు కల్పించిందని ఆయన వెల్లడించారు. ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం సాయంత్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
తాళ్లరేవు: జాతీయ రహదారి 216లో మట్లపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతా అరవింద్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు యానాంకు చెందిన అరవింద్ కోరింగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఫార్మ్డి కోర్సు చదువుతున్నాడు. కాకినాడ నుంచి ద్విచక్రవాహనంపై యానాం వెళుతుండగా మట్లపాలెం లేఅవుట్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో అరవింద్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. స్థానికులు హుటాహుటిన కాకినాడ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
బంగారు ఆభరణాల చోరీ
అన్నవరం: గ్రామ శివార్లలోని కొత్తపేటలో ఒక కుటుంబం ఊరెళ్లిన విషయం పసిగట్టిన దొంగలు ఇంటి తలుపుల తాళం బద్దలు కొట్టి రూ.పది లక్షల విలువైన 98 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించారు. అన్నవరం ఎస్ఐ శ్రీహరిబాబు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేటకు చెందిన వి.విజయ గత నెల 29న విశాఖపట్నంలోని తన అమ్మగారి ఇంటికి వెళ్లారు. అయితే శుక్రవారం ఉదయం ఆమె ఇంటికి ఎదురుగా ఉన్న వారు ఆమెకు ఫోన్ చేసి మీ ఇంటి తలుపు తాళం బద్దలు కొట్టి ఉందని తెలిపారు. దీంతో ఆమె విశాఖపట్నం నుంచి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపులతో బాటు బీరువాలోని లాకర్ తాళం బద్దలు కొట్టి సుమారు 98 గ్రాముల బంగారం అపహరించిన విషయం వెల్లడైంది. దీంతో ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ వచ్చి ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

జీడిపండుకు మూడు గింజలు!