చెత్త ట్రాక్టర్‌ టెండర్‌కు ఆమోదం | - | Sakshi
Sakshi News home page

చెత్త ట్రాక్టర్‌ టెండర్‌కు ఆమోదం

Apr 22 2025 12:17 AM | Updated on Apr 22 2025 12:17 AM

చెత్త ట్రాక్టర్‌ టెండర్‌కు ఆమోదం

చెత్త ట్రాక్టర్‌ టెండర్‌కు ఆమోదం

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో చెత్త తరలింపునకు పిలిచిన టెండర్లలో అతి తక్కువగా నెలకు రూ.23,990కి దాఖలైన కొటేషన్‌కు అన్నవరం దేవస్థానం పాలక మండలి సోమవారం ఆమోదం తెలిపింది. చైర్మన్‌ ఐవీ రోహిత్‌ అధ్యక్షతన పాలక మండలి సమావేశం సోమవారం రత్నగిరిపై జరిగింది. ఈ సమావేశంలో ఈఓ వీర్ల సుబ్బారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. దేవస్థానం అధికారులు గత మార్చి నెలలో నెలకు రూ.60 వేలకు ఎటువంటి టెండర్‌ లేకుండా నామినేషన్‌ మీద ట్రాక్టర్‌తో చెత్త తొలగించే పనిని ఒకరికి అప్పగించారు. తాను రూ.43 వేలకే చెత్త తరలిస్తానని ఒకరు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసినా పట్టించుకోలేదు. దీనిపై మార్చి 28న రత్నగిరిపై చెత్త వివాదం శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీంతో విధి లేని పరిస్థితిలో అధికారులు చెత్త తరలింపునకు టెండర్‌ పిలవగా నెలకు రూ.29,990కి లోయెస్ట్‌ టెండర్‌ దాఖలైంది. ఫలితంగా దేవస్థానానికి నెలకు రూ.36,010, ఏడాదికి 4,32,120 మేర ఆదా అయింది. దీనిని ట్రస్ట్‌బోర్డు ఆమోదించింది. అలాగే, భక్తులు హుండీల్లో సమర్పించిన చీరలు, పంచెలు, కండువాలను హుండీల ఆదాయం లెక్కింపు రోజునే వేలం వేయాలని తీర్మానించారు. కొండ దిగువన నిర్మిస్తున్న రథశాల నుంచి మెయిన్‌ రోడ్డుకు 38 అడుగుల పొడవున అప్రోచ్‌ రోడ్డు, రథశాలకు శాలాహారం నిర్మాణానికి అతి తక్కువకు దాఖలైన టెండర్లకు ఆమోదం తెలిపారు. చైన్నెకి చెందిన పీఎస్‌ కుమార గురుపరన్‌, కె.శాంతి దంపతుల ఆర్థిక సహకారంతో సత్యగిరిపై ఆగమ పాఠశాల ఆవరణలో జీఐ ప్రొఫైల్‌ షీట్‌ షెడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అన్నవరం దేవస్థానం దత్తత ఆలయమైన కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్న అర్చకుల పారితోషికాన్ని నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచాలని నిర్ణయించారు. దేవస్థానం దత్తత తీసుకున్న నాలుగు ఆలయాల్లో కన్సాలిడేటెడ్‌ పద్ధతిలో పని చేస్తున్న స్వీపర్ల వేతనాల పెంపునకు ఆమోదం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement