
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లిని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం భూపాలపల్లి పట్టణంలోని సింగరేణి పంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉత్తర్వులు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి పాల్గొన్నారు. నేటినుంచి గ్రామాల్లో జరిగే భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భూపాలపల్లి నియోజకవర్గానికి 3,046, శాయంపేట మండలానికి 454 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు వివరించారు. నియోజకవర్గంలోని 211 మహిళా సంఘాలకు రూ.16.50 కోట్లు వడ్డీలేని రుణాలు అందించామన్నారు. మున్సిపల్ పరిధిలోని 12 సంఘాలకు రూ.2కోట్లు అందించినట్లు చెప్పారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ముఖ్యంగా ఇందిరమ్మ మహిళా శక్తి, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు డిపోల్లో పెట్టుకునే అవకాశం, పిల్లలకు స్కూల్ యూనిఫాం కుట్టే పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, గృహ నిర్మాణశాఖ పీడీ లోకిలాల్, డీఆర్ఓ బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, చిట్యాల, రేగొండ మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు.