
‘ఆపరేషన్ కగార్’ను నిలిపేయాలి
భూపాలపల్లి రూరల్: దేశంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆపరేషన్ కగార్ను నిలిపేయాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్కుమార్, బందు సాయిలు డిమాండ్ చేశారు. గురువారం ఆపరేషన్ కగార్ను నిలిపేయాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదులతో చర్చలు జరిపిన కేంద్ర ప్రభుత్వం సమానత్వం కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులతో చర్చలు జరపకుండా అతికిరాతకంగా ఎన్కౌంటర్ల పేరిట చంపడం దుర్మర్గామన్నారు. కేంద్రం తన వైఖరిని మార్చుకొని మావోయిస్టులతో శాంతిచర్చలు జరిపి మావోలు జన స్రవంతిలో కలిసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు సోతుకు ప్రవీణ్ కుమార్, క్యాతరాజు సతీష్, వెలిశెట్టి రాజయ్య, నేరేళ్ల జోసెఫ్, మాతంగి రాంచందర్, శేఖర్, లావణ్య, గోమాత, శ్రావణి, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.