
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాల్లో భక్తులు కానుక రూపంలో హుండీల్లో వేయగా 69 రోజుల ఆదాయం రూ. 23.58లక్షల నగదు సమకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు. బుధవారం దేవాదాయశాఖ రెవెన్యూ ఇన్స్స్పెక్టర్ అనిల్కుమార్ పర్యవేక్షణలో నగదును స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు నగదును లెక్కించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ లింగంపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీ మమత, ధర్మకర్తలు రామ్రెడ్డి, రాజయ్య, శ్యాంసుందర్దేవుడా, ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరంలో
ప్రత్యేక పూజలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో బుధవారం మాస శివరాత్రిని పురస్కరించుకొని యాగశాలలో ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు వేద మంత్రోచ్ఛరణల మధ్య లక్ష్మీగణపతి, నవగ్రహ, పంచసూక్తా, రుద్రహవనం హోమాది పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర భక్తులు పాల్గొన్నారు.
నేడు ఓబన్న జయంతి
భూపాలపల్లి రూరల్: నేడు (గురువారం) ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ కార్యాలయంలో సామాజిక ఉద్యమ కారుడు, స్వాతంత్య్ర సమర యోధుడు వడ్డే ఓబన్న 217 జయంతిని నిర్వహించడం జరుగుతుందని బీసీ సంక్షేమ శాఖ అధికారిణి టి.శైలజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు
ఎంపిక
చిట్యాల: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు కె. ప్రశాంతి, బి.అంజలి, సంగి సంజనలు జూనియర్ కబడ్డీ క్రీడల్లో అత్యంత క్రీడాస్ఫూర్తి కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ గోల్కొండ భిక్షపతి తెలిపారు. భూపాలపల్లి అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన జూనియర్ స్థాయి కబడ్డీలో గెలుపొంది గురుకుల పాఠశాల కీర్తిని చాటినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం పాఠశాలలో రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థినులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సత్యం, పీఈటీ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ఎస్టీయూ జిల్లా
నూతన కమిటీ ఎన్నిక
టేకుమట్ల: స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) జిల్లా నూతన కమిటీని కాటారం మండల కేంద్రంలోని కేంబ్రిడ్జి పాఠశాలలో బుధవారం ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సూర రమేష్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ వివరాలను ఆయన వెల్లడించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడిగా లావుడ్య రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా రేపాల గణేష్, ఆర్థిక కార్యదర్శి గుగ్గిల్ల విజేందర్, అసోసియేట్ అధ్యక్షుడిగా మోక్లోత్ పరమ్సింగ్, అదనపు ప్రధాన కార్యదర్శి హట్కార్ రమేష్, జిల్లా భాధ్యులు పీర్ల మోహన్రావు, మంద నీలిమారెడ్డి, పొనగంటి సదయ్య, ఝెర్ర సురేందర్, కూచన సంజీవయ్య, వైనాల సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఆట సదయ్య, ఉపాధ్యక్షులు నామని సంభయ్య, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దానం నాగరాజు, జిల్లా సీనియర్ నాయకులు కుర్రె ప్రవీన్కుమార్, మండల బాధ్యులు రేపాల వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
