
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
భూపాలపల్లి రూరల్: నేడు (ఆదివారం) భూపాలపల్లి పట్టణంలోని 11 కేవీలైన్ మంజూరునగర్ ఫీడర్పై చెట్లకొమ్మలు తీయడం, మరమ్మతుల దృష్యా జవహర్నగర్ కాలనీ, 5ఇంక్లైన్ కమాన్, లారీల అడ్డా, మైసమ్మకాలనీ, కలెక్టర్ కార్యాలయం, జీఎంఆర్ వెంచర్, వెంగళరావు వెంచర్, బీసీ కాలనీ, మాధవరావుపల్లి, కుందురుపల్లి గ్రామాల్లో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని వినియోగదారులు సహకరించాలని భూపాలపల్లి విద్యుత్ శాఖ ఏఈ విశ్వాస్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రేపటినుంచి లోక్ అదాలత్
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జిల్లా కోర్టు ఆవరణలో జరిగే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి సీఐ నరేష్కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలో వివిధ కారణాలతో కేసుల పాలైన వారు రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇరువర్గాలు హాజరై సంబంధిత కేసులను తొలగించుకోవాలని సూచించారు.
రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి
కన్నాయిగూడెం: మండలంలో బాండ్ పేరుతో రైతులను మోసం చేసిన మొక్కజొన్న కంపెనీలు రైతుల అకౌంట్లలో తక్షణమే డబ్బులు జమ చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకట్రెడ్డి అన్నారు. రైతు సంఘం మండల అధ్యక్షుడు కావిరి నాగయ్య అధ్యక్షతన శనివారం మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వెంకట్రెడ్డి హాజరై మాట్లాడారు. సోమవారం వరకు డబ్బులు జమ చేయకుంటే రైతులను సమీకరించి ఆందోళన చేస్తామన్నారు. నకిలీ విత్తనా ల క్రయ విక్రయాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, తోకల రవి, సురేష్, పాషా, రామారావు, లక్ష్మిపతి, మధు, రవీందర్, పాపారావు, రాజబాబు, రఘుపతి, శ్రీను, మహేష్ పాల్గొన్నారు.
గీత కార్మికుడికి తీవ్రగాయాలు
చిట్యాల: మండలంలోని జడల్పేట గ్రామానికి చెందిన బయగాని సమ్మయ్య వృత్తిలో భాగంగా శుక్రవారం సాయంత్రం తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపడి తలకు తీవ్రంగా గాయమైంది. తోటి కార్మికులు 108లో వరంగల్కు తరలించారు. ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
విద్యుదాఘాతంలో దుక్కిటెద్దు మృతి
భూపాలపల్లి రూరల్: విద్యుదాఘాతంలో దుక్కిటెద్దు మృతిచెందిన ఘటన శనివారం భూపాలపల్లి మండలం కొత్తపల్లి(ఎస్ఎం) గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన యాస శంకరయ్యకు చెందిన ఎద్దు మధ్యాహ్నం పొలం వద్ద 11కేవీ లైన్కు తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. ఎద్దు విలువ సుమారు రూ.80వేలకు పైగా ఉంటుంది. బాధితుడు శంకరయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గాలివాన బీభత్సం
ఏటూరునాగారం : మండలంలోని ఎలిశెట్టిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్ వైర్లు తెగిపడగా, ఇంటి కప్పులు, రేకులు ఎగిరిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. కొన్ని చోట్ల మామిడికాయలు రాలిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్డు సౌకర్యం లేక వర్షాకాలంలో జంపన్నవాగు నుంచి ఈదుకుంటూ పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల సమయంలో పడవలను నడుపుతున్నారని వాపోయారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం