
ఫెయిలైతే నిరాశ చెందొద్దు
జగిత్యాలక్రైం: పదో తరగతి ఫలితాల్లో ఫెయిలైనవారు, మార్కులు తక్కువ వచ్చిన వారు నిరాశ చెందొద్దని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో మాట్లాడారు. మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యామని నిరాశ చెంది అఘాయిత్యం చేసుకోవడం సరికాదని, తల్లిదండ్రులకు గుండెకోత మిగల్చొద్దని సూచించారు. మార్కులు తక్కువ వస్తే జీవితంలో ఓడినట్టు కాదని, అవి కేవలం కొలమానం మాత్రమేనని పేర్కొన్నారు. జీవితం మరెన్నో అవకాశాలతో నిండి ఉందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు మానసికంగా ధైర్యం కల్పించేలా తోడుగా ఉండాలని, వారిని ప్రోత్సహించాలన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్టీసీ బస్సులో పొగలు
మల్లాపూర్: అసలే ఎండాకాలం.. ఆపై 120 మంది ప్రయాణికులు.. ఓవర్ హీట్తో ఇంజిన్ నుంచి పొగలు రావడంతో ఓ ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సంఘటన మల్లాపూర్ మండల కేంద్రం శివారులో బుధవారం చోటుచేసుకుంది. జగిత్యాల డిపోకు చెందిన బస్సు నిర్మల్కు బయల్దేరింది. అందులో సుమారు 120మంది ప్రయాణికులు ఎక్కారు. మల్లాపూర్ శివారుకు చేరగానే ఒక్కసారిగా ఇంజిన్ నుంచి పొగలు రావడంతో డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. మరో బస్సు వచ్చేవరకూ ప్రయాణికులు ఎండలోనే వేచి ఉండి ఇబ్బందిపడ్డారు.
బాక్సింగ్ కోచింగ్ ప్రారంభం
జగిత్యాల: జిల్లాకేంద్రంలో బాక్సింగ్ సమ్మర్ క్యాంప్ను ప్రారంభించినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు పాదం మహేందర్, సెక్రెటరీ శ్రీనివాస్ తెలిపారు. మినీస్టేడియంలో బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాంప్ ఉంటుందని, ఆసక్తి గల క్రీడాకారులు రావచ్చని పేర్కొన్నారు. నెలరోజులపాటు ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అసోసియేషన్ నాయకులు అరుణ్, తిరుపతి, కిరణ్, వంశీకృష్ణ, రాఘవరావు, సాకేత్, వరుణ్ పాల్గొన్నారు.
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
సారంగాపూర్: బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన ఆకుల చిన్న గంగన్న (55) బుధవారం పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కుమారస్వామి కథనం ప్రకారం.. గంగన్న ఏడాది క్రితం చెట్టుపై నుండి కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డా డు. శరీరంలో విపరీతమైన నొప్పులు ఉండడంతో అసౌకర్యానికి గురవుతున్నాడు. మందులు వాడినా నొప్పులు తగ్గడంలేదు. జీవితంపై విరక్తి చెంది పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. గంగన్న భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కన్నవారిని విస్మరిస్తే చర్యలు
మెట్పల్లి: తల్లిదండ్రులను విస్మరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన వృద్ధుల సంరక్షణ చట్టాల అవగాహన పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. వృద్ధుల సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించడానికి అసోసియేషన్ సభ్యులు చేస్తున్న కృషిని అభినందించారు. జిల్లా అధ్యక్షులు హరి అశోక్కుమార్, గౌరిశెట్టి విశ్వనాథం, హన్మంత్రెడ్డి, యాకూబ్, అశోక్రావు, వొజ్జెల బుచ్చిరెడ్డి తదితరులున్నారు.

ఫెయిలైతే నిరాశ చెందొద్దు

ఫెయిలైతే నిరాశ చెందొద్దు