
సమన్వయంతో సమస్యలు నివారించండి
సాక్షి, సిటీబ్యూరో: వర్షాలు పడినప్పుడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాలుగు విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత సీజన్ను దృష్టిలో ఉంచుకొని వర్షాలు, వరదలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వర్షాకాల సన్నద్ధతపై ఆయా విభాగాల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నగరంలో అసంపూర్తిగా ఉన్న నాలాల పూడికతీత పనుల్ని వీలైనంతగా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఇప్పటికే గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్వద్ద రెయిన్వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనుల పురోగతి గురించి ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. హార్వెస్టింగ్ వెల్స్లోకి చేరే వర్షపు నీటిని ఆటోమేటిక్ పంపులతో బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్(సీఆర్యూ)లో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణ, అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక పాలసీని తయారు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ అధికారులు శేషాద్రి, మాణిక్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హెచ్ఎండీఏ, తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
వర్షాకాల సన్నద్ధతపై అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి
పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉండాలి
మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో..