
ఏడాదిలోనే ప్రజావ్యతిరేకత
● జూన్ 4న ‘వెన్నుపోటు దినం’లో ప్రజలకు చేసిన మోసం బహిర్గతం చేయాలి ● నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు
తెనాలి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై ఏడాదికాలంలోనే వ్యతిరేకత పెరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమం కన్నా అధికంగా ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీనిచ్చారని, పవన్కల్యాణ్ భరోసానిచ్చారని గుర్తుచేశారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదన్న భావనకు ప్రజలు వచ్చారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాన్నీ, హామీలనిచ్చి మోసగించిన తప్పిదాన్ని ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ సీపీ బహిర్గతం చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం పార్టీ పిలుపు మేరకు జూన్ 4న ‘వెన్నుపోటు దినం’ను విజయవంతం చేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూన్ 4న జరగనున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంపై శుక్రవారం సాయంత్రం స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటైన పార్టీ ముఖ్యనేతల సమావేశానికి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షత వహించారు. ‘వెన్నుపోటు దినం’ పోస్టరును ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో 184 హామీలను ఇచ్చారనీ, పైగా ఇంకా సూపర్సిక్స్ ఉన్నాయని గుర్తుచేశారు. ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్కు గ్యారెంటీ’ అన్నారని చెప్పారు. ఏ పథకాన్నీ అమలు చేయలేదని చెబుతూ అదేమంటే రూ.4 వేల పింఛను ఇస్తున్నామని వారే చెబుతున్నారని రాంబాబు అన్నారు. గ్యాస్బండకు డబ్బులు ఇచ్చామంటున్నా 1.49 కోట్ల కనెక్షన్లు ఉంటే 30–40 వేలకు మించి ఇవ్వలేదన్నారు. కార్యకర్తల నుండి పెద్ద నాయకుల వరకు అందరిపైనా కేసులు పెట్టటం, జైళ్లకు పంపటం, బెయిలు రాకుండా చేస్తూ భయపెట్టాలని చూడటం మినహా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. చంద్రబాబునాయుడు గతంలో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిస్తే, ఇప్పుడు మరో రెండు పార్టీలతో కలిసి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. అమ్మ ఒడికి పేరు మార్చి తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏటా రూ.15 వేలు ఇస్తామన్నారని, రైతుభరోసా కూడా లేదన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవన్నారు.
విజయవంతానికి కార్యాచరణ
మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ తెనాలిలో జూన్ 4న ఉదయం 10 గంటలకు మార్కెట్ సెంటర్ నుంచి సబ్కలెక్టర్ కార్యాలయం వరకు వెన్నుపోటు దినం నిరసన ప్రదర్శన జరుగుతుందని చెప్పారు. విజయవంతానికి కార్యాచరణను రూపొందిస్తున్నామని తెలిపారు. పార్టీ గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పాలనలో ఏవిధంగా మోసపోయామన్న భావన ప్రజల్లో ఉందని చెప్పారు. జగన్మోహన్రెడ్డి పాలనలో ఎటువంటి లబ్ధి కలిగిందీ, ఎలా జీవనప్రమాణాలు పెరిగాయి? చంద్రబాబు హామీలను అమలుచేయకుండా ఏవిధంగా మోసం చేసిందీ స్పష్టంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లిముంత పోతురాజు, గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గెడ్డటి సురేంద్ర, అధికార ప్రతినిధి కొడాలి క్రాంతి, తెనాలి పట్టణ, రూరల్ మండల, కొల్లిపర మండలాల అధ్యక్షులు దేసు శ్రీనివాసరావు, చెన్నుబోయిన శ్రీనివాసరావు, కల్లం వెంకటప్పారెడ్డి, కొర్ర యశోద, మైనారిటీ విభాగం అధ్యక్షుడు షేక్ దుబాయ్బాబు మాట్లాడారు. ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, పార్టీ సీనియర్ నేతలు మర్రెడ్డి బ్రహ్మారెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి, తాడిబోయిన రమేష్, జొన్నల శివారెడ్డి, బొంతు నరేంద్రరెడ్డి, బూరెల దుర్గాప్రసాద్, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్రెడ్డి, ఈద యశ్వంత్రెడ్డి, కుర్రా జస్వంత్, బండ్లమూడి నాని, తదితరులు పాల్గొన్నారు. అక్కిదాసు కిరణ్ స్వాగతం పలికారు. ఆయా కమిటీల పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంపై