
కౌన్సెలింగ్లో ఉపాధ్యాయులకు ముప్పుతిప్పలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహణలో విద్యాశాఖ దారుణంగా విఫలమైంది. గుంటూరు జోన్–3 పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 17 హెచ్ఎం పోస్టులతోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ, నగరపాలక సంస్థ, మున్సిపల్ పాఠశాలల పరిధిలో మరో 56 గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు గురువారం కౌన్సెలింగ్కు ఏర్పాట్లు చేశారు. ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున పిలిచారు. గుంటూరులోని భారతీయ విద్యాభవన్లో గురువారం ఉదయం 8 గంటలకల్లా ఉండాలని స్పష్టం చేశారు. గుంటూరుతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి సైతం ఉపాధ్యాయులు తరలివచ్చారు. ప్రభుత్వ హైస్కూళ్లలో హెచ్ఎం పోస్టులకు గుంటూరులోని ఆర్జేడీ కార్యాలయంలో కౌన్సెలింగ్కు ఏర్పాట్లు చేసిన అధికారులు ఇదిగో, అదిగో అంటూ సాయంత్రం 6 గంటల వరకు ఎటూ తేల్చకుండా ఉండిపోయారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం బదిలీల అనంతరం ఏర్పడే ఖాళీలతో ఈ నెల 30న ప్రమోషన్ల కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. కానీ రెండు రోజుల ముందుగానే 28న నిర్వహించేందుకు ప్రయత్నించి విఫలమైన విద్యాశాఖాధికారులు గురువారం మరోసారి అదే తీరును కొనసాగించారు. విద్యాశాఖ తీరుతో విసుగెత్తిపోయిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళనకు దిగడంతో సాయంత్రం 6.30 గంటలకు గుంటూరు, పల్నాడు డీఈవోలు సీవీ రేణుక, చంద్రకళ వచ్చి మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ ప్రారంభించారు.
ఉద్యోగోన్నతుల పేరుతో రెండు రోజులపాటు నరకం గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఉపాధ్యాయులకు కష్టాలు ఉదయం రావాలని పిలిచి సాయంత్రం వరకు ఎటూ తేల్చని అధికారులు