
ఏటా నష్టాలు.. అప్పులే..
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు రూరల్ మండలానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి అనే రైతు 2021లో బ్యాంకులో బంగారు ఆభరణాలు పెట్టి రూ.80 వేలు రుణం తీసుకున్నారు. మూడు రోజుల క్రితం రెన్యూవల్ కోసం బ్యాంకుకు వెళ్లగా మొత్తం డబ్బు చెల్లించి రెన్యూవల్ చేసుకోవాలని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక అప్పు చేసి రూ.1.20 లక్షలు చెల్లించారు. లక్షల మంది అన్నదాతల సమస్య ఇదే. వ్యవసాయం, బంగారు ఆభరణాల పేరుతో తీసుకున్న రుణాలకు రెన్యూవల్ కష్టాలు తప్పడం లేదు. రుణాల చెల్లింపు విషయంలోనైనా కూటమి ప్రభుత్వం స్పందించి మినహాయింపులు ఇవ్వాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
బ్యాంకర్లు అనేక కొర్రీలు పెడుతున్నారని వాపోతున్నారు. బ్యాంకుల్లో తీసుకొన్న అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తేనే రెన్యూవల్ అంటూ మెలిక పెడుతున్నారని పేర్కొంటున్నారు. జిల్లాలో వివిధ బ్యాంకులకు చెందిన 529 బ్రాంచ్లు ఉంటే.. వీటిలో 16 లక్షలకుపైగా ఖాతాలు ఉన్నాయి. ఇందులో ఐదు లక్షల ఖాతాలు పంట రుణాలు తీసుకునే రైతులవి. వ్యవసాయ ఆధారిత రుణాల విషయంలో బ్యాంకర్లు చిన్నచూపు చూస్తున్నారు. రెన్యూవల్ పేరుతో రైతులను వేధిస్తున్నారు.
మొత్తం చెల్లిస్తేనే ...
పది శాతం బ్యాంకులు మినహా.. మిగిలినవి రెన్యూవల్ విషయంలో రుణగ్రహీతలను ముప్పుతిప్పలు పెట్టి వేధిస్తున్నాయి. తీసుకున్న రుణానికి ఏడాది గడువు తీరిందని మెసేజ్లు రావడంతో బ్యాంకులకు రుణగ్రహీతలు పరుగులు పెడుతున్నారు. అక్కడికి వెళ్లాక రెన్యూవల్ చేసుకోవాలంటే తీసుకున్న మొత్తం డబ్బులు చెల్లించాలని చావు కబురు చల్లగా చెబుతున్నారు. అప్పుడే రెన్యూవల్ చేస్తామని మెలిక పెడుతున్నారు. చాలా మంది అష్టకష్టాలు పడి మొత్తం చెల్లించి రెన్యూవల్ చేయించుకుంటున్నారు. కొన్ని బ్యాంకులు తీసుకున్న రుణాలను పూర్తి స్థాయిలో చెల్లించినా.. మళ్లీ తిరిగి రుణాలు ఇవ్వడంలో రైతులు, రుణగ్రహీతలను ఇబ్బందులు పెడుతున్నాయి. ఎప్పుడెళ్లినా రేపు రమ్మని చెప్పి తప్పించుకుంటున్నాయి. సీ–బిల్, ఈకేవైసీ, ఇతర వివరాలను సాకు చూపి జాప్యం చేస్తున్నాయి.
వ్యాపార లావాదేవీలు, వ్యవసాయం పేరుతో తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలు తీసుకుని వడ్డీ వ్యాపారాలు చేసుకునే వారు 30 శాతం మంది ఉన్నారని అంచనా. అలాగే 70 శాతం మంది మాత్రం వ్యవసాయ పనులు నిమిత్తం, బతుకుతెరువు కోసం పట్టాదారు పాసుపుస్తకాలు, బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో కుదువపెట్టి రుణాలు తీసుకుంటున్నారు. ఆ రుణాల ద్వారా వ్యవసాయం వృద్ధి చేసుకుంటున్నారు. బోర్లు వేసుకోవడం, కొత్త రకం పంటలు పండించడం, వివిధ రకాల పంటల సాగుకు అవసరమయ్యే ఖర్చులను భరించేందుకు బ్యాంకుల్లో అప్పులు చేస్తున్నారు. ఆపై వాటిని విడిపించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. పంట బాగా పండి.. మంచి ధర ఉంటే రైతు వాటిని విడిపించుకునేందుకు వెనకడుగు వేయడం లేదు. ప్రకృతి కాటేయడంతో ఏటా కష్టాలు.. కన్నీళ్లు తప్పడం లేదు. అటు కూటమి ప్రభుత్వం కూడా పెట్టుబడి సాయం అందించడం లేదు. మరోవైపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ తీవ్ర వైఫల్యం చెందింది. ఇకనైనా దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
గతంలో రెన్యూవల్ ఇలా..
గతంలో బ్యాంకుల్లో వ్యవసాయ, బంగారు రుణాలకు రెన్యూవల్కు వెళ్తే ఇబ్బందులు పెట్టేవారు కాదు. వడ్డీ వరకు చెల్లించుకుని రెన్యూవల్ చేసేవారు. లేకుంటే భూ విలువ, బంగారం విలువ ప్రకారం తీసుకున్న బ్యాంకు రుణానికి ఏటా 5 నుంచి 10 శాతం వరకు పెంచుతూ వడ్డీ జమ చేసుకునే వారు.
మినహాయింపు ఇవ్వాలి
ఆటో కొనుగోలు చేసేందుకు గతేడాది గుంటూరు నగరంలోని ఓ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రూ.లక్ష వరకు రుణం తీసుకున్నా. రెన్యూవల్కు సంబంధించి మెసేజ్ రావడంతో బ్యాంకు వద్దకు వెళ్లా. అక్కడ మొత్తం చెల్లించాలన్నారు. అవస్థలు పడి మొత్తం డబ్బులు చెల్లించి, 15వ తేదీన రెన్యూవల్ చేయించా. ఈ నిబంధన నుంచి మినహాయించాలి. –ఎం.నరేంద్ర, గుంటూరు
వ్యవసాయ రుణ వివరాలు ఇలా..
వ్యవసాయ, బంగారు నగలపై రుణాలకు రెన్యూవల్ కష్టాలు పూర్తిగా డబ్బులు చెల్లించాలంటూ మెలిక పెడుతున్న బ్యాంకు సిబ్బంది గతంలో వడ్డీ చెల్లిస్తే చాలు రెన్యూవల్ పెట్టుబడి సాయం అందక, గిట్టుబాటు ధరలు లేక ఇప్పటికే రైతులకు కష్టాలు కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
కొత్త విధానం అమల్లో ఉంది
కొత్త విధానం గతేడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఇకపై పూర్తి నగదు చెల్లించి రెన్యూవల్ చేయించుకోవాలి. ప్రస్తుతం వడ్డీ మాత్రమే చెల్లించి రెన్యూవల్ చేయించుకునే పద్ధతి లేదు. దీనికి సంబంధించి పలు సమస్యలు వస్తున్నాయి.
– గూడెం మహిపాల్రెడ్డి, ఎల్డీఎం, గుంటూరు జిల్లా