
మిగులు భూముల్లో నిరసనగా ఏరువాక
జంగారెడ్డిగూడెం: ముంపు లేని మిగులు భూముల్లో ఏరువాక కార్యక్రమం నిర్వహించి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. మండలంలోని ఏ పోలవరం చిన్నవారిగూడెం గ్రామాల ప్రాజెక్టు ఏరియాలో అకాల వర్షాలు కురవడంతో పేదలందరూ ఐక్యంగా దుక్కు దున్ని విత్తనాలు చల్లి సాగు ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జంగారెడ్డిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఎం.జీవరత్నం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ.ప్రాజెక్టు ముంపు లేని మిగులు భూముల్లో పేదలందరూ ఐక్యంగా సాగు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ భూమి పేదలు సాగు చేస్తున్నప్పటికీ ఈ ఏడాది వర్షాలు ముందుగా రావడంతో విత్తనాలు నారుమడలు పోసి వరి నాట్లకు సిద్ధం కావాలన్నారు. ఇదే సందర్భంలో ఎరక్రాలువ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూస్వాముల నుంచి వేలాది ఎకరాలు ప్రభుత్వం సేకరించిందని, ఇందుకు లక్షల కోట్ల పరిహారం పొందిన భూస్వాములు అక్రమంగా వరి, మొక్కజొన్న, చెరుకు, అరటి జామాయిల్, పామాయిల్ కొబ్బరి వంటలు సాగు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు లేని భూముల్లో పేదలకు సాగు చేసేందుకు ఇవ్వమని కోరుతున్నా పట్టించుకోకుండా అధికారులు భూస్వాములతో కుమ్మకై ్క ఇరిగేషన్ చట్టాలను తుంగలో తొక్కుతున్నారని దుయ్యబట్టారు. దీనిపై వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించగా పేదలు ఈ భూములను సాగుచేసుకునేలా కోర్టు తీర్పు ఇచ్చిందని, ఈ తీర్పును అధికారులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు యాగంటి సీతా గుడెల్లి వెంకట్రావు. ఏ ప్రభాకర్ రావు, జి సూర్య కిరణ్. పిల్లి చంటి, కే సుబ్బారావు ఎర్రమాల కుమారి, బత్తుల వెంకన్న, బొక్క వెంకటేష్, రెడ్డి బోయిన సత్యావతి, బెల్లంకొండ శివయ్య, పిల్లి పోతురాజు, పి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.