
వైఎస్సార్ విగ్రహం పాక్షిక ధ్వంసం
పెంటపాడు: పెంటపాడులోని వెలంపేట కోనేరు చెరువు వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని బుధవారం వేకువజామున గుర్తుతెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. విగ్రహం ఎడమ చేయి మోచేతి వరకూ విరిగి కింద పడి ఉంది. గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు బర్ల జయ రాంబాబు ఈ విషయాన్ని ముందుగా గుర్తించారు. మంగళవారం రాత్రి వరకూ విగ్రహం బాగానే ఉందని, ఉదయం చూస్తే ఇలా చేయి విరిగి పడి ఉందని వైఎస్సార్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో టీడీపీ మహానాడు జరుగుతున్న సమయంలో ఇక్కడ వైఎస్సార్ విగ్రహం ధ్వంసం కావడం చర్చనీయాంశమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్రెడ్డి జిల్లాలో ఓదార్పు యాత్ర చేసిన సమయంలో ఈ విగ్రహాన్ని స్వయంగా ఆవిష్కరించారు. విగ్రహం జీవ కళ ఉట్టిపడేలా ఉందని శిల్పిని, నిర్వాహకులను అభినందించారు. అప్పటి నుంచి ఇక్కడ పలు కార్యక్రమాలను వైఎస్సార్ అభిమానులు నిర్వహిస్తున్నారు.
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
పెదవేగి : అప్పుల బాధ తట్టుకోలేక మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. పెదవేగి మండలం కె కన్నాపురం గ్రామానికి చెందిన కమిలి భాస్కరరావు (35) గృహ నిర్మాణ అవసరాల నిమిత్తం కొంత కాలం క్రితం ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేదు. దీంతో రికవరీ ఏజెంట్లు అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయగా మనస్తాపానికి గురైన భాస్కరరావు బుధవారం ఇంటి సమీపంలోని కోకో తోటలో చెట్టుకు కరెంట్ వైరుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోలీసులు శవపంచనామా నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం
పెంటపాడు: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం పాలైన ఘటన బుధవారం తాడేపల్లిగూడెం– భీమవరం రోడ్డులో ముదునూరు వద్ద జరిగింది. పెంటపాడు ఎస్సై స్వామి తెలిపిన వివరాలివి. ఆరుగొలను గ్రామానికి చెందిన అడ్డగర్ల సాయి రమేష్ (34) కరెంట్ పని చేస్తుంటాడు. బుధవారం పనినిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లి తిరిగి మోటార్ సైకిల్పై స్వగ్రామం వస్తుండగా ముదునూరు మలుపు వద్ద భీమవరం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

వైఎస్సార్ విగ్రహం పాక్షిక ధ్వంసం