ప్రభుత్వాసుపత్రికి సుస్తీ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాసుపత్రికి సుస్తీ

Apr 19 2025 9:23 AM | Updated on Apr 19 2025 9:23 AM

ప్రభు

ప్రభుత్వాసుపత్రికి సుస్తీ

టాయిలెట్స్‌లో సౌకర్యాలు లేక ఇబ్బందులు

భీమవరం ప్రభుత్వ ఆస్పత్రిలో మా పాపకు డెలివరీ అయ్యింది. ఆస్పత్రిలో వారం రోజుగా ఉంటున్నాం. బాలింతల వార్డులో ఉన్న టాయిలెట్స్‌లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు సక్రమంగా రావడం లేదు. బాలింతలు టాయిలెట్లకు వెళితే ఇబ్బంది పడుతున్నారు. ఏసీలు ఒకటి పనిచేస్తే మరొకటి పనిచేయడం లేదు.

– కె.సుభాషణి, మొగల్తూరు

పాడైన బెడ్‌లపై ఎలా పడుకునేది?

బాలింతలు పడుకునే బెడ్‌లు దెబ్బతిన్నాయి. చిరిగిపోయి, గుంతలు పడ్డాయి. వాటిపై బాలింతలు పడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. బెడ్‌పై తల్లీ బిడ్డ పడుకోవడానికి సరిపోక ఇబ్బంది పడుతున్నారు. తల్లి బెడ్‌ పక్కన చంటి బిడ్డకు ఊయల సౌకర్యం కల్పించాల్సి ఉన్నా చర్యలు లేవు.

– ఎ.అన్నమ్మ, మోగల్లు

భీమవరం(ప్రకాశం చౌక్‌) : పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల జిల్లా కేంద్రమైన భీమవరం ప్రభుత్వ ఆస్పత్రి సమస్యలతో సతమతమవుతోంది. సరిగా పనిచేయని ఏసీలు, పాడైన బెడ్లు, సరైన సౌకర్యాలు లేని టాయిలెట్లతో పేషెంట్లు అవస్థలు పడాల్సి వస్తోంది. 50 పడకల సదుపాయం ఉన్న ఈ ఆస్పత్రికి భీమవరం, ఉండి, నర్సాపురం నియోజకవర్గాలతో పాటు కృష్ణా జిల్లాలోని సమీప గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారు. రోజూ 400కు పైగా ఓపీ నమోదవుతుంటే ఆస్పత్రిలో చేరే పేషెంట్లు సంఖ్య నెలకు 200 వరకు ఉంటుంది. ఆస్పత్రిలో రెండు బాలింతల వార్డులు, ఇతర రోగులకు మూడు వార్డులు ఉన్నాయి. బాలింతల వార్డుల్లో నాలుగు ఏసీలకు గాను రెండు మొత్తానికి పనిచేయకుండా నిరుపయోగంగా మిగిలాయి. మరో రెండు తరచూ మరమ్మతులతో అక్కరకు రావడం లేదు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత వల్ల ఫ్యాన్లు ఉన్నా వేడిగాలులకు బాలింతలు, శిశువులు విలవిల్లాడాల్సి వస్తోంది. బాలింతలు, రోగుల వార్డుల్లోని మంచాలపై ఉన్న పరుపులు చిరిగిపోయాయి. ఎత్తుపల్లాలుగా ఉన్న వాటిపై పడుకోవడానికి బాలింతలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెడ్‌పై చంటి బిడ్డతో పడుకోవడానికి సరిపోవడం లేదని బాలింతలు అంటున్నారు. శిశువుల కోసం బెడ్‌ పక్కన బాస్కెట్‌ బెడ్‌ల సౌకర్యం లేదు.

వేధిస్తున్న సౌకర్యాల కొరత

ఆస్పత్రిలోని వార్డుల్లో టాయిలెట్స్‌, ఆవరణలోని అవుట్‌ పేషెంట్లు కోసం ఏర్పాటుచేసిన టాయిలెట్లలో సరైన సౌకర్యాలు లేక బాలింతలు, వారి సహాయకులు, పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం కోసం వచ్చిన అవుట్‌ పేషెంట్లు, గర్భిణులు కూర్చునేందుకు కుర్చీలు, బెంచీలు లేవు. ఎక్స్‌రే విభాగం వద్ద కూర్చునేందుకు సదుపాయాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.. మరోపక్క ఆస్పత్రిలో మంచినీటి సౌకర్యం పూర్తి స్థాయిలో లేదు. బాలింతలు, పేషెంట్లు మంచినీళ్లు బయట నుంచి తెచ్చుకుని తాగుతున్నారు.

జేసీ రావడంతో బెడ్‌ షీట్‌లు మార్చారు

బాలింతల వార్డుల్లో బెడ్‌లపై కనీసం బెడ్‌షీట్‌లు వేయడం లేదు. బాలింతలు ఇంటి నుంచి తెచ్చుకున్న దుప్పట్లు, బెడ్‌ షీట్‌లు వేసుకుంటున్నారు. శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ విజిట్‌కు రావడంతో అప్పటికప్పుడు ఆస్పత్రి సిబ్బంది బాలింతల వార్డులో బెడ్‌ షీట్‌లు వేశారు.

పట్టించుకోని అధికారులు:

ప్రభుత్వ ఆస్పత్రిని సమస్యలు పీడిస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆస్పత్రిలో సమస్యలను పరిష్కరించి రోగులకు అవసరమైన వసతులు కల్పించే దిశగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చొరవ చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో ఆస్పత్రి స్థితిగతులపై అధికారులతో సమీక్షించిన దాఖలాలు లేవు.

పనిచేయని ఏసీలు, పాడైన బెడ్లు

టాయిలెట్లు సరిగా లేక ఇక్కట్లు

అవస్థలు పడుతున్న రోగులు, బాలింతలు

ప్రభుత్వాసుపత్రికి సుస్తీ 1
1/3

ప్రభుత్వాసుపత్రికి సుస్తీ

ప్రభుత్వాసుపత్రికి సుస్తీ 2
2/3

ప్రభుత్వాసుపత్రికి సుస్తీ

ప్రభుత్వాసుపత్రికి సుస్తీ 3
3/3

ప్రభుత్వాసుపత్రికి సుస్తీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement