
తీర్థయాత్రలకు వెళితే ఇంటిని దోచేశారు
రాజానగరం: ఇంటికి తాళం పెట్టి కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు వెళ్తే, దుండగులు ఆ ఇంటిలో చొరబడి రూ.1.77 లక్షల విలువైన వస్తువులను దోచుకుపోయారు. దివాన్చెరువు శివారు రఘునాథపురంలో ఈ ఘటన జరిగింది. ఎస్సై నాగార్జున బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన బల్లి వెంకటేశులు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 25న తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్లాడు. దీన్ని గమనించిన దొంగలు ఆ ఇంటి తాళం బద్దలు కొట్టి, దొరికినంత దోచుకుపోయారు. తర్వాత ఉదయం పక్కింటి వాళ్లు ఆ ఇంటి తలుపులు తెరచివుండటాన్ని గమనించి, తీర్థయాత్రలకు వెళ్లిన వారు తిరిగి వచ్చారమోనని చూశారు. వారి జాడ లేకపోవడంతో ఏదో జరిగి ఉంటుందని భావించి వెంకటేశుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే వెంకటేశులు ఇంటికి వచ్చి చూడగా బీరువాలో భద్రపరిచిన 64 గ్రాముల బంగారు నగలు, 850 గ్రాముల వెండి వస్తువులతో పాటు కొంత నగదు అపహరణకు గురైనట్టుగా గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వీరయ్యగౌడ్, ఎస్సై నాగార్జున తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, చోరీ జరిగిన విధానాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ని రప్పించి, వేలిముద్రలను సేకరించారు.