
లాటరైట్ లారీలకు జరిమానా
ప్రత్తిపాడు: వంతాడ క్వారీ నుంచి లాటరైట్ ఖనిజాన్ని తరలిస్తూ నిబంధనలు పాటించని తొమ్మిది లారీలపై బుధవారం ట్రాన్స్పోర్టు అధికారులు కేసులు నమోదు చేశారు. జిల్లా డీటీసీ శ్రీధర్ ఆదేశాల మేరకు శంఖవరం మండలం కత్తిపూడి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాస్ ప్రత్తిపాడు – లంపకలోవ రహదారిలో వాహనాల తనిఖీ చేపట్టారు. వంతాడ క్వారీ నుంచి లాటరైట్ ఖనిజాన్ని రావికంపాడుకు తరలిస్తున్న వాహనాలను పరిశీలించగా, లాటరైట్ ఖనిజం లోడుపై కవరు కప్పి ఉంచకపోవడం, మితిమీరిన వేగంతో వాహనాలను నడపడం, డ్రైవర్ల వద్ద డ్రైవింగ్ లైసెన్సులు లేకపోవడం తదితర కారణాలపై తొమ్మిది వాహనాలపై కేసులు నమోదు చేశారు. వీటికి మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాస్ రూ.58 వేల జరిమానా విధించారు.