
భూ ఆక్రమణకు పాల్పడుతున్నారని ఫిర్యాదు
అమలాపురం రూరల్: తాము 68 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 1.40 ఎకరాల భూమిని కొనుగోలు చేశామంటూ అమలాపురానికి చెందిన టీడీపీ నాయకుడు గంధం పల్లంరాజుకు చెందిన కొంతమంది వ్యక్తులు బెదిరిస్తున్నారని కామనగరువుకు చెందిన భూపతిరాజు సుబ్బరాజు, నరసింహరాజు సోదరులు వాపోతున్నారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ తాము కౌలుదారులుగా లైఫ్టైమ్ సాగు చేసుకోవచ్చని అమలాపురం సివిల్ కోర్డులో ట్రిబ్యునల్ ఆర్డర్ ఇవ్వడంతో భూమిని సాగు చేసుకుంటున్నామని తెలిపారు. సాగు భూమిలో లారీలతో ఇసుక తరలించి భూ ఆక్రమణకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకుంటే తమను చంపుతామని పలువురు బెదిరించారని అన్నారు. పోలీసుల సమక్షంలో దాడికి ప్రయత్ని ంచారని వాపోయారు. అర్ధరాత్రి సమయంలో దౌర్జన్యంగా చేలోకి ప్రవేశించి ఇసుకతో భూమిని కప్పేస్తున్నారని అన్నారు. తమకు న్యాయం జరిగేవరకూ పోరాడతామని సుబ్బరాజు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి పేరు చెబుతూ తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. మంత్రి అండదండలతో రెచ్చిపోయి భూ ఆక్రమణలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎస్పీ, తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై తమకు ఫిర్యాదు అందిందని అమలాపురం తాలుకా ఎస్సై శేఖర్బాబు తెలిపారు. సివిల్ వివాదం కావడంతో దర్యాప్తు చేస్తున్నామన్నారు.