
ఆరోగ్య రక్షకుల పోరుబాట
● సీహెచ్ఓల నిరవధిక సమ్మె
● ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల వెలవెల
● పల్లె ప్రజలకు అందని
ప్రాథమిక వైద్య సేవలు
● స్పందించని కూటమి సర్కారు
ఇవీ డిమాండ్లు
● ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలి.
● ఆరేళ్ల సర్వీసు పూర్తయిన సీహెచ్ఓలను రెగ్యులర్ చేయాలి.
● ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలి.
● పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలి.
● ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలి.
● నిర్దిష్టమైన జాబ్చార్ట్ అందించాలి.
● ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్ఓలను మినహాయించాలి.
● హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్లు, బదిలీలు, పితృత్వ సెలవులు వంటివాటిని త్వరితగతిన అమలు చేయాలి.
రాజమహేంద్రవరం రూరల్: వారంతా పల్లెనాడి పట్టే చిరుద్యోగులు. పల్లెల్లో పేదలకు వైద్య సేవలు అందించేందుకు నిత్యం శ్రమిస్తూంటారు. అటువంటి వారు తమ సమస్యలు పరిష్కరించాలని కూటమి సర్కారుకు విన్నవించారు. ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో, తొలుత వారు శాంతియుత పోరాటం చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు(ఎంఎల్హెచ్పీ), కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓ) నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు (విలేజ్ హెల్త్ క్లినిక్) వెలవెలబోతున్నాయి. వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందక పల్లె ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఆర్ఎంపీలతో పాటు పీహెచ్సీలను, ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో సీహెచ్ఓలు రోడ్డెక్కారు. వినూత్న రీతిలో నిరసనలతో హోరెత్తిస్తున్నారు. వారికి పలు ఉద్యోగ సంఘాలు సైతం మద్దతు పలుకుతున్నాయి.
368 విలేజ్ హెల్త్ క్లినిక్లు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 368 విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేశారు. వీటిలో 67 రకాల వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల మందులు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్లలో బీఎస్సీ నర్సింగ్ చదివిన వారిని సీహెచ్ఓలుగా నియమించారు. జిల్లావ్యాప్తంగా 358 మంది సీహెచ్ఓలు సేవలందిస్తున్నారు. ఎంఎల్హెచ్పీ, సీహెచ్ఓలు విలేజ్ హెల్త్ క్లినిక్లకు వచ్చే రోగులకు సాధారణ జబ్బులతో పాటు దీర్ఘకాలిక రోగాలైన బీపీ, షుగర్ వంటి వాటికి సైతం ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, మందులు ఇస్తున్నారు. పిల్లలు, గర్భిణులకు పరీక్షలు చేసి, చికిత్స అందిస్తున్నారు. రోగికి వచ్చిన వ్యాధిపై ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పీహెచ్సీ లేదా జిల్లా కేంద్రంలోని టెలి మెడిసిన్ సెంటర్ వైద్యులకు ఫోన్ చేసి, రోగులతో మాట్లాడించి, చికిత్స అందించే ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకునే ప్రయాస రోగులకు తప్పేది. ఎవరైనా విలేజ్ హెల్త్ క్లినిక్కు రాలేని పక్షంలో సీహెచ్ఓలు వారి ఇళ్లకే వెళ్లి పరీక్షలు చేసి, మందులు ఇస్తున్నారు. టీకాలు వేయించడంలో ముందుండి పని చేస్తున్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు కృషి చేస్తున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) సర్వేలో ఏఎన్ఎంలతో సమానంగా సీహెచ్ఓలు పని చేశారు.
నిరవధిక సమ్మెలోకి...
ఇన్ని సేవలు అందిస్తున్న తమకు తగిన ప్రతిఫలం దక్కడం లేదని సీహెచ్ఓలు ఆవేదన చెందున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ ఎంఎల్హెచ్పీ – సీహెచ్ఓ అసోసియేషన్ ఆధ్వర్యాన వారు గత నెల 16 నుంచి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో 27వ తేదీన జిల్లా అధికారులకు నోటీసులిచ్చి నిరవధిక సమ్మె ప్రారంభించారు. గత నెల 28వ తేదీ నుంచి విలేజ్ హెల్త్ క్లినిక్లకు సీహెచ్ఓలు వెళ్లడం లేదు. దీంతో పల్లె ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఆఫీసర్ డాక్టర్ శ్రీవల్లి.. సీహెచ్ఓలకు ప్రత్యామ్నాయంగా ఏఎన్ఎంలు, హెల్త్ సూపర్వైజర్లకు బాధ్యతలు అప్పగించారు. అయితే, సీహెచ్ఓల మాదిరిగా పూర్తి స్థాయిలో అందడం లేదు.
పీఆర్సీ ఇవ్వాలి
సీహెచ్ఓలకు జీతభత్యాలు ఇవ్వడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఆరేళ్ల సర్వీసు పూర్తయిన ఎంఎల్హెచ్పీలను రెగ్యులర్ చేయాల్సి ఉన్నా చేయడం లేదు. జీఓ–64 ప్రకారం ఎన్హెచ్ఎంలోని అన్ని కేడర్ల ఉద్యోగులకు 23 శాతం పీఆర్సీ ఇవ్వాలి. 189 కేడర్లకు ఇచ్చి, సీహెచ్ఓలకు మాత్రం ఇవ్వలేదు. అందరికీ పీఎఫ్ ఇస్తున్నా మాకు మాత్రం ఇవ్వడం లేదు.
– రాము, సభ్యుడు, ఏపీ ఎంఎల్హెచ్పీ – సీహెచ్ఏ అసోసియేషన్, తూర్పు గోదావరి
డిమాండ్ల సాధనకే..
జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించాలనే ప్రధానమైన డిమాండ్తో సమ్మెకు దిగాం. తొలుత శాంతియుతంగానే నిరసన చేపట్టాం. ఫలితం లేకపోవడంతో నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించాం. గత నెల 28 నుంచి సమ్మె కొనసాగుతోంది. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు.
– టి.మమత, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఏపీ ఎంఎల్హెచ్పీ – సీహెచ్ఏ అసోసియేషన్, తూర్పు గోదావరి
ఇంక్రిమెంట్లు ఇవ్వాలి
ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంట్, ప్రతి నెలా జీతంతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వాలి. ఆరేళ్లు దాటిన సీహెచ్ఓలను క్రమబద్ధీకరించాల్సి ఉన్నా చేయడం లేదు. డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకూ సమ్మె ఆగదు.
– టి.సుచరిత, సభ్యురాలు, ఏపీ ఎంఎల్హెచ్పీ –
సీహెచ్ఏ అసోసియేషన్, తూర్పు గోదావరి

ఆరోగ్య రక్షకుల పోరుబాట

ఆరోగ్య రక్షకుల పోరుబాట

ఆరోగ్య రక్షకుల పోరుబాట