
ఇద్దరు సీఆర్వో ఆఫీసు గుమస్తాల సస్పెన్షన్
అన్నవరం: సత్యదేవుని దర్శనానికి విచ్చేసిన భక్తులకు వసతి గదులు ఖాళీ ఉండి కూడా అద్దెకు ఇవ్వకుండా భక్తుల్ని ఇబ్బంది పెట్టారన్న అభియోగంపై సీఆర్వో కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న గుమస్తాలు కె. శ్రీనివాస్, కలికేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఈఓ వీర్ల సుబ్బారావు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. శనివారం అర్ధరాత్రి కొంతమంది భక్తులు వసతి గదుల కోసం సీఆర్వో కార్యాలయం వద్ద వాకబు చేయగా గదులు ఖాళీ లేవని అక్కడ సిబ్బంది తెలిపారు. దీంతో వారు డిస్ప్లే బోర్డులో గదులు ఖాళీ ఉన్నాయని చూపిస్తుంటే మీరు గదులు ఖాళీ లేవంటున్నారేంటని ప్రశ్నించారు. దీంతో బాటు సీఆర్వో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కొంతమంది భక్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఈఓకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దాంతో ఈఓ వెంటనే సీఆర్వో కార్యాలయానికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా 60 గదులు ఖాళీ ఉన్నట్టు తేలింది. దాంతో ఆ గదులను ఆ భక్తులకు అద్దెకి ఇప్పించారు. భక్తుల్ని ఇబ్బంది పెట్టినందుకు కౌంటర్లో ఉన్న ఇద్దరినీ సస్పెండ్ చేశారు.