వైభవం.. నారసింహుని కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. నారసింహుని కల్యాణం

May 25 2025 12:09 AM | Updated on May 25 2025 12:09 AM

వైభవం

వైభవం.. నారసింహుని కల్యాణం

సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహుని ఆలయంలో శనివారం ఆర్జీత సేవగా స్వామివారి శాంతి కల్యాణం వైభవంగా జరిగింది. తొలుత ఆలయంలోని కల్యాణ మండపంలో ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం స్వామివారి శాంతి కల్యాణం విష్వక్సేన పూజతో అర్చకులు ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్‌ ఆధ్వర్యాన స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకుడు పెద్దింటి వెంకట శ్రీనివాస్‌ ఈ కల్యాణం జరిపించారు. ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు.

మహా జ్యేష్టాభిషేకం ఏర్పాట్లపై సమీక్ష

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి మూలవరులకు వచ్చే నెల 11న మహా జ్యేష్టాభిషేక ఏర్పాట్లపై ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ, అర్చకులతో సమీక్షించారు. ఈ మేరకు శనివారం అంతర్వేది దేవస్థానం కార్యాలయంలో అర్చకులతో చర్చించారు. సప్త నదులైన గంగ, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి జలాలతో స్వామి మూలవర్లకు మహా జ్యేష్టాభిషేకం వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ అభిషేకంలో పాల్గొనేందుకు టిక్కెట్‌ రూ.400గా నిర్ణయించామన్నారు.

స్వామిని చూసి.. మది మురిసి

మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. తెల్లవారు జామున అర్చకులు సుప్రభాత సేవ, వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తొలి హారతిని కనుల పండువలా జరిపించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.3.49,554 ఆదాయం వచ్చిందని ఈఓ సత్యనారాయణ రాజు తెలిపారు. స్వామి వారిని 5,500 మంది స్వామి దర్శించుకోగా, నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.93,351 ఆదాయం వచ్చిందని తెలిపారు.

వచ్చే నెల 5 నుంచి కల్యాణోత్సవాలు

స్వామివారి తిరు కల్యాణోత్సవాలు వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఈఓ సత్యనారాయణరాజు తెలిపారు. జూన్‌ 9 వరకూ ఈ కల్యాణోత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 6వ తేదీ రాత్రి 9.15 గంటలకు కల్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. ఆదివారం ఉదయం స్వామివారి కల్యాణోత్సవాలకు శ్రీకారం చుడతామన్నారు.

బౌద్ధ భారతంగా

తీర్చిదిద్దాలన్నదే ఆశయం

అమలాపురం టౌన్‌: దేశాన్ని బౌద్ధ భారతంగా తీర్చిదిద్దాలన్నదే తన తాతయ్య డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయమని ఆ మహానీయుని మనమడు, బుద్ధిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (బీఎస్‌ఐ) అధ్యక్షుడు భీమారావు యశ్వంత్‌ అంబేడ్కర్‌ అన్నారు. తన తాతయ్య ఆశయాన్ని నెరవేర్చేందుకు తాను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. బుద్ధిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆంధ్ర శాఖ స్థానిక ప్రెస్‌ క్లబ్‌ భవనంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా యశ్వంత్‌ అంబేడ్కర్‌, సొసైటీ జాతీయ ప్రధాన కార్యదర్శి నికాడే హాజరయ్యారు. సొసైటీ రాష్ట్ర శాఖ కన్వీనర్‌ ఎం.మల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో యశ్వంత్‌ అంబేడ్కర్‌ మాట్లాడుతూ బుద్ధిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా సంస్థను 1955లో తన తాతయ్య డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్థాపించారని గుర్తు చేశారు. 1956లో నాగపూర్‌లో దీక్ష భూమి వద్ద ఐదు లక్షల మందితో బౌద్ధ మతాన్ని స్వీకరించారని చెప్పారు. త్వరలోనే బీఎస్‌ఐ ఆంధ్ర శాఖకు కొత్త కమిటీని నియమిస్తామని చెప్పారు. ఈ జిల్లాలో అంబేడ్కర్‌ అనుచరులు, అభిమానులు చాలా మంది ఉన్నారని.. వీరంతా బుద్ధిజం వైపు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారన్నారు. జిల్లా అధ్యక్షుడు పెనుమాల సుధీర్‌, కార్యదర్శి కె.వెంకటరమణ, బీఎస్‌ఐ రాష్ట్ర నాయకులు మట్ట వెంకట్రావు, పెనుమాల చిట్టిబాబు, టి.అజయ్‌ బోస్‌, డాక్టర్‌ డి.చిన్న కేశవులు, బి.రాజేంద్రప్రసాద్‌ ప్రసంగించారు.

దరఖాస్తులకు గడువు పెంపు

రాయవరం: టీచర్ల బదిలీల్లో భాగంగా స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీ దరఖాస్తులకు ఒక రోజు గడువు పెంచారు. ముందుగా ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం శనివారంతో గడువు ముగియగా, ఈ దరఖాస్తుల గడువును ఆదివారం రాత్రి 11.45 గంటల వరకు పెంచినట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నోడల్‌ డీఈఓ పి.రమేష్‌ తెలిపారు.

వైభవం.. నారసింహుని కల్యాణం 1
1/1

వైభవం.. నారసింహుని కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement