
ఘనంగా ఖరీఫ్ విత్తన దినోత్సవం
తిరుపతి సిటీ: తిరుపతిలోని ఎన్జీరంగా వర్సిటీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో గురువారం ఖరీఫ్ విత్తన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ వి.సుమతి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ నూతన విత్తనాల ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. క్రాప్ విభాగాధిపతి డాక్టర్ కే జాన్ మాట్లాడుతూ వేరుశనగ, అపరాలు, నువ్వులు, చిరుధాన్యాలలో ఖరీఫ్ పంట కాలానికి అనువైన నూతన రకాలు, వాటి గుణగణాలు, విత్తన శుద్ధి, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం రైతులకు పలు రకాల విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కీటక శస్త్ర విభాగాధిపతి డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ భారతి, డాక్టర్ అమరావతి, శ్రీవల్లిదేవి, మహేశ్వరరెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.