
జిల్లాలో 30 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
● డీఎఫ్ఓ భరణి
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో వర్షాకాలం ప్రారంభమయ్యే సమయానికి 30 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్దేశించుకున్నామని జిల్లా అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గురువారం నీవా నగరవనంలోని పిల్లల పార్కులో మొక్కలు నాటారు. ఆమె మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు అందరూ మొక్కలు నాటాలని కోరారు. అలాగే, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడారు. అనంతరం వివిధ అంశాలపై నిర్వహించిన పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. లయన్స్క్లబ్ సభ్యులు అందజేసిన సీడ్ బాల్స్ను నగరవనంలో వేశారు. కలెక్టర్ నిధులు రూ.10 లక్షలతో జరగుతున్న పనులను ఆమె పరిశీలించారు. ఆటవస్తువులు, అడ్వెంచర్ గేమ్స్కు సంబంధించిన వస్తువుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. త్వరలో వీటిని కలెక్టర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్కుమార్రెడ్డి, ఎఫ్ఆర్వోలు బాలకృష్ణరెడ్డి, థామస్, డీఆర్వో ఆనంద్రెడ్డి, కరణ్సింగ్, ఎఫ్ఎస్వో ఉష, ఎఫ్బీఓలు రెడ్డెప్ప, ఢిలీరాణి, సతీష్, గౌస్బాషా, మధు తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి అమ్మవారి తెప్పోత్సవాలు
చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలను శనివారం నుంచి 11వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ అధికారులు శరవేగంగా పూర్తిచేస్తున్నారు. ఈ ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమ పూజలు అందుకుని భక్తులను అనుగ్రహించనున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు తెప్పోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
తెప్పోత్సవాల వివరాలు
శనివారం మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు శ్రీసుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు అనుగ్రహించనున్నారు.
ఆర్జితసేవలు రద్దు
తెప్పోత్సవాల కారణంగా తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్ సేవను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

జిల్లాలో 30 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం