
మా పరిస్థితేంటి సారూ!
బాబుగారి భవంతి సరే..
● అప్పట్లో కొత్త ఊర్లు, ఇప్పుడు ఊరికో ఇల్లు లేదే! ● జిల్లాలో గత ప్రభుత్వంలో మంజూరైన మొత్తం ఇళ్లు 77,366 ● కూటమి పాలనలో ఒక్క ఇల్లు పునాదులేసింటే ఒట్టు ● జిల్లాలో స్తంభించిన పక్కా ఇళ్ల నిర్మాణ పనులు
పలమనేరు: సీఎం చంద్రబాబు కుప్పంలో మాత్రం కొత్త ఇల్లు కట్టుకొని కొత్త హెలీక్యాప్టర్లో సకుటుంబ సమేతంగా వచ్చి గృహప్రవేశం చేసుకొని సంతోషంగా వెళ్లిపోతే ఇంటి బిల్లులందక మాలాంటి పేద లు ఎప్పుడు ఇంటి నిర్మాణాలు పూర్తి చేసేదని గత ప్రభుత్వంలో పక్కా ఇళ్లను పొందినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ఏడాది పాలనలో ఇప్పటిదాకా ఓ ఇంటి పునాదికూడా మొదలుకా లేదని కూటమి పార్టీకి చెందినవారు మదన పడితున్నారు. కూటమి పాలనలో జిల్లాలోని హౌసింగ్ కార్యాలయాల్లో ఎలాంటి పనులు ముందుకు సాగక నిర్మానుష్యంగా మారాయి. గత ప్రభుత్వంలో కొత్త ఊర్లు నిర్మించగా ఈ కూటమి హయాంలో ఊరికో ఇల్లు కూడా మంజూరు కాలేదు.
గత ప్రభుత్వంలో ఇలా....
సొంతిల్లు కట్టుకోవాలన్నదే పేద వాడి కలను నిజం చేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పలమనేరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా గృహాలను మంజూరు చేసింది. జిల్లాలో 77,365 ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 609 జగనన్న లేఅవుట్లున్నాయి. మొత్తంగా జిల్లాలో 46,163 వేల ఇళ్లు పూర్తికాగా 31,203 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6,719 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 2,389 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 4,330 ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. జిల్లాలో వీటి నిర్మాణాలకోసం గత ప్రభుత్వం రూ.1000.687 కోట్లను ఖర్చు చేసింది. కూటమి ప్రభుత్వంలోనూ ఇళ్ల నిర్మాణాలకు బిల్లులిస్తామని అధికారులు చెబుతున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. లబ్ధిదారులతో అధికారులు సమావేశాలను నిర్వహించినా ఫలితం కనిపించడం లేదు. దీంతో హౌసింగ్ అధికారులు నిర్మాణాలను ఎలా వేగవంతం చేయాలో అర్థంకావడం లేదు.
పలమనేరులో జగనన్న కాలనీని చూద్దాం
పట్టణ సమీపంలోని బొమ్మిదొడ్డి కాలనీలో మొత్తం 3031 ఇళ్లు మంజూరైతే ఇందులో వీటిల్లో 1721 మాత్రం పూర్తయ్యాయి. మిగిలిన 1310 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో 14 ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. నియోజకవర్గంలో 12 లేఅవుట్లున్నాయి. ఈ విషయమై స్థానిక హౌసింగ్ డీఈ దాస్ను వివరణ కోరగా డివిజన్ పరిధిలో గత కొన్నాళ్లుగా పక్కాగృహాల నిర్మాణ పనులు వేగంగా సాగడం లేదని చెప్పారు. ఇంటి పనులు చేసిన వారికి బిల్లులిస్తామని లభ్ధిదారులతో అవగాహన సమావేశాలను సైతం నిర్వహించామన్నారు.
కొత్త గృహాల ఊసేలేదు
గత ప్రభుత్వంకంటే ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో ఇంటి నిర్మాణాలు చేపడతామని కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఊదరగొట్టింది. కానీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ఓ ఇంటి పునాదికూడా పడలేదు. ఆరునెలల క్రితం జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పంచాయతీలవారీగా కూటమి నేతల ద్వారా పక్కా ఇళ్లకు అర్జీలను తీసుకున్నారు. ఆ మేరకు వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు కాకుండా కేవలం కూటమి కార్యకర్తలకే ఇళ్లు మంజూరు చేయించేలా హౌసింగ్ అధికారులకు వాటిని పంపారు. వీరి లెక్కమేరకు జిల్లాలో సుమారు 30వేల మంది లభ్ధిదారులుగా చేర్చారు. కానీ ఇప్పటిదాకా ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు కాకపోవడం కొసమెరుపు. ఈ విషయమై పలమనేరు హౌసింగ్ డీఈ దాస్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. కార్యాలయంలోని సిబ్బందిని అడగ్గా మీకు తెలియందేముంది సార్ ముందులాగా ఇప్పుడు లేదు పాత ఇళ్లే ఇంకా పూర్తిగాక ఇబ్బంది పడుతుంటే మళ్లీ కొత్త ఇళ్లు ఎప్పుడొస్తాయో ఎలా చెప్పేదన్నారు.