
● అప్పడు సంపద వరాలు.. ఇప్పుడు బీద అరుపులు ● ఊరికో హామీ.
ఏ రైతూ సంతోషంగా లేడు
ఎన్నికలపుడు పలమనేరులో చంద్రబాబు మాట్లాడుతూ, ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక ఏ రైతు అయినా సంతోషంగా ఉన్నాడా? ఏ పంటకైనా ధరలున్నాయా? టమాటా సాగు చేసి ఇప్పటికే రూ.నాలుగున్నర లక్షలు నష్టపోయాను. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే టమా టాను కొనుగోలు చేసింది. తప్పుడు హామీలిచ్చిన కూటమి నేతలను మా ముందుకు రమ్మనండి మా బాధలు చూసైనా న్యాయంచేస్తారేమో. – గోవిందురెడ్డి, ఆదర్శరైతు,
బేరుపల్లి, పలమనేరు మండలం
మాట తప్పిన లోకేష్
మా ఊర్లో లోకేష్ పాదయాత్రకు గుర్తుగా 200 కి.మీ శిలాఫలకం వేసి, ఏడాదిలో కాలేజీ పెడతామన్నారు. శిలాఫలకమైతే అట్లాగే ఉంది కానీ కాలేజీకి మాత్రం కనీసం పునాదిరాయి కూడా వేయలేదు. రాజకీయాల్లో మాట ముఖ్యం. నాయకులే ఇచ్చిన మాట తప్పితే ఎట్లా చెప్పండి..?
– మురగయ్య, కార్వేటినగరం
జిల్లా కేంద్రమైన చిత్తూరుకు గతేడాది మే 11న వచ్చిన చంద్రబాబు బహిరంగ ప్రసంగంలో ఇచ్చిన హామీలు.. ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం, జిల్లా కేంద్రాన్ని విద్యాహబ్గా మారుస్తాం, ఐటీ టవర్, పరిశ్రమల ఏర్పాటు, చిత్తూరు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. కానీ వీటిలో ఒక్క హామీను కూడా నెరవేర్చడానికి బీజం పడలేదు. గతేడాది ఫిబ్రవరి 6, 7 తేదీల్లో చిత్తూరు నియోజకవర్గంలో యువగళంలో పర్యటించిన నారా లోకేష్.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ సబ్ప్లాన్ను కొనసాగిస్తామని, ఎస్సీలకు కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. చెప్పిందానికి పూర్తి భిన్నంగా పథకాన్ని రద్దు చేశారు. ఇక చిత్తూరులో యూనివర్సిటీ ఏర్పాటు, ఎలక్ట్రానిక్ మానుఫాక్చర్ ఫ్యాక్టరీ ఏర్పాటు లాంటి హామీలు లెక్కేలేదు.
● గంగాధరనెల్లూరులోని కత్తెరపల్లె గ్రామంలో... 2023లో జనవరి 11న యువగళం పాద యాత్రలో భాగంగా 200 కి.మీ పూర్తిచేసుకున్న నారా లోకేష్.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామన్న హామీ ఆచరణకు నోచుకోలేదు. కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలను తిరుపతి జిల్లాలో చేర్చే బాధ్యత తనదనిచెప్పి, ఇప్పుడు పక్కకు తప్పుకున్నారు.
● పలమనేరులో ఎన్నికల నేపథ్యంలో పర్యటించిన చంద్రబాబు నాయుడు గతేడాది మార్చి 27న నిర్వహించిన బహిరంగ సభలో హామీల వరాలు గుప్పించారు. ప్రపంచంలోని అన్ని కంపెనీల్లో పలమనేరువాసులు ఉండేలా, ఇంట్లో కూర్చుని ఉద్యోగాలు చేసేలా చూస్తామన్నారు. కృష్ణా జలాలనే కాదు గోదావరి జలాలను సైతం తీసుకొస్తామన్నారు. వ్యవసాయానికి గుండెకాయలాంటి పలమనేరు ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా మారుస్తామని, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని, గంజాయి, డ్రగ్స్ కనిపించకుండా చేస్తామన్నారు. కానీ ఏపీ నుంచి బెంగళూరుకు తరలే గంజాయి మొత్తం పలమనేరు మీదుగానే వెళుతోంది.
● యువగళం పాదయాత్రలో భాగంగా 2023 ఫిబ్రవరి 13వ తేదీన పుత్తూరు బహిరంగ సభలో పాల్గొన్న నారా లోకేష్.. విజయపురం కోసలనగరంలో ఏపీఐఐసీ ద్వారా ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తామని, గాలేరు–నగరి ప్రాజెక్టును పూర్తిచేస్తామని, నగరిలో టెక్స్టైల్స్ పార్కు, పవర్లూమ్ పరిశ్రమలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్, అగ్నికుల క్షత్రియులకు బీసీ సర్టిఫికెట్లు మంజూరు చేస్తామన్నారు. వీటన్నింటినీ తాము అధికారంలోకి ఇచ్చిన తొలి ఏడాదిలోనే పూర్తి చేస్తామని చెప్పిన చినబాబు.. ఒక్క హామీ నెరవేరిస్తే ఒట్టు. చేనేతలకు 500 యూనిట్లకు ఉచిత విద్యుత్పై జీఓ విడుదల చేశారేతప్ప.. కార్యాచరణకు నోచుకోలేదు.
● పుంగనూరును సింగపూర్ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు.. ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా అభివృద్ధి సమావేశాలు, జెడ్పీ సమావేశాల్లో గత ప్రభుత్వం పుంగనూరులో ఎందుకు అన్ని రూ.కోట్లు ఖర్చు చేసిందని..? ఎందుకు పరిశ్రమలు వచ్చాయని ప్రశ్నించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
కుప్పానికి ఇచ్చిన వరాలు ఇవే..
ఎన్నికల ముందు కుప్పంవాసులకు చంద్రబాబు కురిపించిన వరాల జల్లులు అన్నీ ఇన్నీ కావు.
టెకీలు వర్క్ ఫ్రం హోం చేసుకోవడానికి ప్రతి మండలానికి వర్క్ స్టేషన్
నిరుద్యోగులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం
పొలాలకు రోడ్లు, బెంగళూరు నుంచి సజ్జాపురం మీదుగా కుప్పంకు ఫోర్లేన్ రోడ్డు, రూ.100 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు
బెంగళూరు సిటీతో కుప్పానికి అనుసంధానం
వంద ఎకరాల్లో గ్రానైట్ పరిశ్రమ
లాయర్లు, జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసి ఇంటి స్థలాలు ఇస్తాం.
ఒక్కో పంచాయతీకి రూ.కోటి–రూ.2 కోట్ల నిధుల కేటాయింపు,
హంద్రీ–నీవా కాలువ పనులు పూర్తి చేసి కుప్పానికి నీళ్లు తీసుకొస్తాం
మల్లానూరు, రాళ్లబూదుగూరును ప్రత్యేక మండలాలుగా గుర్తిస్తాం
కుప్పం–పలమనేరు ఫోర్లేన్ రోడ్డుగా మారుస్తాం
నారా లోకేష్ 2023లో యువగళాన్ని కుప్పంలో ప్రారంభించి ఇచ్చిన హామీలు..
యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టో తీసుకొస్తాం
ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం
రాయలసీమ రైతులకు ఉచితంగా డ్రిప్ పరికరాలు పంపిణీ చేస్తాం.
కుప్పంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం.
రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం
విద్యుత్ చార్జీలు, ఉప్పు–పప్పు, గ్యాస్, వంట నూనెల ధరలు తగ్గిస్తాం.
కుప్పంలో పరిశ్రమలు తీసుకొస్తాం
ప్రజలకు ఉపాధి కల్పించి వలసల నివారిస్తాం
ఇచ్చిన హామీల్లో ఈ ఏడాదిలో ఒక్కటంటే కార్యరూపం దాల్చలేదు. అందుకే ఇప్పటికే పుష్–పుల్ రైల్లో ఉదయం 6.30 గంటలకు ప్రతిరోజూ పనుల కోసం కుప్పంవాసులు బెంగళూరుకు వలసలు వెళుతూనే ఉన్నారు.
పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాళెంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ ఏనుగుల సంచారం ఎక్కువగా ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చే ట్రెంచ్లు తవ్వించి సోలార్ ఫెన్సింగ్ వేయిస్తామని హామీ ఇచ్చారు. దీని గురించి ఇంతవరకు పట్టించుకోలేదు.

● అప్పడు సంపద వరాలు.. ఇప్పుడు బీద అరుపులు ● ఊరికో హామీ.