
నేడు కార్యాలయాల వద్ద పడిగాపులు
● ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలకు ప్రాధాన్యం
కూటమి పాలనలో కులం, మతం, పార్టీ, వర్గం అనే అంశాలను తుంగలో తొక్కారు. అమలు చేస్తున్న అరకొర సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల పేరు వెనుక మూడు అక్షరాలుంటే వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్భాటంగా ప్రారంభించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరుకు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకున్నారు. అదే విధంగా ఏ పని కావాలన్నా కూటమి ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి ప్రజలు సలాం కొట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. కూటమి పాలనను చూస్తున్న ప్రజలు విస్తుపోతున్నారు.
● కొత్త పింఛన్ల ఊసే లేదు
కూటమి ప్రభుత్వంలో కొత్త పింఛన్లు ఇవ్వకపోగా కూటమి ప్రభుత్వం రాజకీయ అక్కసుతో అధికారంలోకి రాగానే జిల్లాలో 15 వేలకు పైగా పింఛన్లను తొలగించి పేదల పొట్ట కొట్టింది. ప్రస్తుత సర్కారు పాలనలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఒక్క లబ్ధిదారునికి సైతం నూతన పింఛన్ మంజూరు చేయని దుస్థితి. దీంతో ప్రతి సోమవారం వృద్ధులు కాళ్లు అరిగేలా పింఛన్ల మంజూరుకు కలెక్టరేట్కు విచ్చేసి వినతులు అందజేసి వేడుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 10 వేలకు పైగా అర్హులు కొత్త పింఛన్ల మంజూరుకు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు.
● అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
కూటమి పాలనలో వలంటీర్లను నిలిపివేయడంతో ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీ కనుమరుగయింది. దీంతో ఈ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వృద్ధులు అవస్థలు పడుతూ సచివాలయాల వద్ద పడిగాపులు పడి పింఛన్లు తెచ్చుకుంటున్నారు.
● రేషన్ వాహనాలు కనుమరుగు
ప్రతి నెలా పేద ప్రజల ఇంటి వద్దకు రేషన్ సరుకులను చేరుస్తున్న రేషన్ బండికి కూటమి సర్కారు కనుమరుగు చేసింది. రేషన్ వాహనాలకు రాజకీయ రంగును పులిమి రద్దు చేశారు. దీంతో ఇంటింటికి రేషన్ పథకానికి మంగళం పాడారు. ఆ వాహనాలను నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్న వేల మంది రోడ్డున పడ్డారు.
● గడప దాటుతున్నా పరిష్కారం కాని సమస్యలు
ప్రస్తుత కూటమి సర్కారు వలంటీర్లను తొలగించడంతో ప్రజలు అర్జీలు చేతపట్టి గడప దాటాల్సిన దుస్థితి ఏర్పడింది. కలెక్టరేట్లలో సమస్యల పరిష్కారానికి అర్జీలు ఇస్తున్నా పరిష్కారానికి నోచుకోవడం లేదు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలోని ముఖ్యమైన 29 శాఖల్లో 55,789 అర్జీలు నమోదు అయ్యాయి. అందులో 10 శాతం వినతులు కూడా పరిష్కారానికి నోచుకోని దుస్థితి కూటమి పాలనలో నెలకొంది.
● ఒక్క సెంటు భూమి ఇవ్వని ప్రభుత్వం
ప్రస్తుత కూటమి పాలనలో సొంతింటి కోసం ప్రజలు నిత్యం కలెక్టరేట్లో దరఖాస్తులు అందజేస్తున్నారు. ఈ కూటమి పాలనలో ఒక్క పేద లబ్ధిదారునికి సెంటు భూమి ఇవ్వని దుస్థితి ఏర్పడింది.
● కానరాని ఇంటింటికీ వైద్యం
ప్రస్తుత కూటమి పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్న రోగులకు నాణ్యమైన వైద్యం అందివ్వని దుస్థితి ఏర్పడింది.