
ఘాట్ రోడ్లో ప్రమాదం
తిరుమల: తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న శ్రీవారి భక్తులు ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. కర్నాటకకు చెందిన భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఒకటో మలుపు వద్ద కారు కొండను ఢీంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు భక్తుల్లో ఇద్దరికి చిన్నపాటి గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కుంకీలతో భీ‘కరి’ కట్టడి
తిరుపతి మంగళం : అటవీ ప్రాంతంలో నుంచి బయటకు వస్తున్న మద గజాలను కుంకీ ఏనుగులతో కట్టడి చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అజయ్కుమార్ నాయక్ ఆదేశించారు. ఆదివారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శనశాలలోని ఎలిఫెంట్ క్యాంపును ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పలమనేరులోని క్యాంపుతో పాటు జూ పార్కును కూడా కుంకి ఏనుగుల నిర్వహణకు వినియోగించుకోవాలని సూచించారు. శిక్షణ పొందిన ఏనుగులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. గజ దాడులలో ఒక్కరు కూడా మృత్యువాత పడకుండా, పంట పొలాలు నాశనం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలా గే జూ పార్క్ లోని వన్యప్రాణుల స్థావరంలో పరిశుభ్రతను మెరుగుపరచాలన్నారు. అనంతరం జంతువుల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. జూలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంవలో తిరుపతి సీఎఫ్ సెల్వం, అనంతపురం సీఎఫ్ యశోదాబాయి పాల్గొన్నారు.
ప్రశాంతంగా
యూపీఎస్సీ పరీక్షలు
తిరుపతి అర్బన్ : యూపీఎస్సీ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ఆదివారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, శ్రీపద్మావతి కళాశాల్లోని పరీక్ష కేంద్రాలను స్టేట్ అబ్జర్వర్, జిల్లా ప్రతేక అధికారి కోన శశిధర్, జాయింట్ సెక్రటరీ ఎస్జీ అజ్మీరా, డీఆర్ఓ నరసింహులుతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం ఉదయం నిర్వహించిన పరీక్షకు 5,261 మందికి గాను 2,941 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. 2,320 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 5,261 మందికి గాను 2,929 మంది హజరైనట్లు తెలిపారు. 2,332 మంది గైర్హాజరైనట్లు వివరించారు. అభ్యర్థులు ఏమాత్రం ఇబ్బంది పడకుండా పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా మౌలిక వసతులు కల్పించినట్లు వెల్లడించారు.

ఘాట్ రోడ్లో ప్రమాదం