
విద్యార్థులకు ఎన్సీసీ సర్టిఫికెట్లు
కొత్తగూడెంఅర్బన్: దేశానికి రెండో రక్షణ దళంగా, అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరోవైపు చదువులలో రాణిస్తున్న జిల్లాలోని శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాల, సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలోని దాదాపు 55 ఎన్సీసీ విద్యార్థులకు ఎన్సీసీ అకడమిక్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం సర్టిఫికెట్లు అందజేశారు. 11 తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ ఆఫీస్ ఖమ్మంలో జరిగిన సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో విద్యార్థులు కమాండింగ్ ఆఫీసర్ ఎస్కే భద్ర నుంచి సర్టిఫికెట్లు అందుకున్నారు. ఈమేరకు విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.పద్మ, డాక్టర్ శారద, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పూర్ణచంద్రరావు, ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ శ్రీలత, డాక్టర్ జి.మధు అభినందించారు.
బొగ్గు నాణ్యత పెంపునకు కార్యాచరణ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో జి–15 గ్రేడ్ బొగ్గును థర్మల్ విద్యుత్ కేంద్రాల వారు తీసుకోవడం లేదని, అన్ని ఏరియాలలో జీ–13 గ్రేడ్ బొగ్గును సిద్ధం చేసి రవాణా చేయాలని, ఇది శనివారం నుంచి అమల్లోకి తేవాలని సంస్థ డైరెక్టర్లు వివిధ ఏరియాల జీఎంలకు, ఇతర అధికారులకు డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్ పీపీ అండ్(పా) కే.వెంకటేశ్వర్లు శుక్రవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నాణ్యతా ప్రమాణాలపై వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సమీక్షించారు. ఇంధన సరఫరా ఒప్పందం ప్రకారం... ఒప్పకున్న గ్రేడ్ బొగ్గును ఇవ్వకుంటే నష్ట పరిహారం కూడా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
విత్తన షాపుల తనిఖీ
ఇల్లెందు: పట్టణంలోని విత్తన దుకాణాలను శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖాధికారి బాబూరావు తనిఖీ చేశారు. స్టాక్ వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిషేధించిన బీటీ–3 పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ రైతుకు కొనుగోలు రశీదు ఇవ్వాలని సూచించారు. నిబంధనలు పాటించని వ్యాపారులపై చర్యలు ఉంటాయని తెలిపారు. జిల్లా టెక్నికల్ ఏఓ సాయినారాయణ, మండల వ్యవసాయశాఖ అధికారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఎన్సీసీ సర్టిఫికెట్లు