
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్
టేకులపల్లి: వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం సులానగర్ ప్రాథమిక వైద్యశాల ఆవరణలో జరిగిన ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దోమలు పుట్టకుండా ఉండడానికి నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించడం, ప్రతి మంగళ, శుక్రవారం డ్రైడే స్వచ్ఛందంగా నిర్వహించుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. నూతన దంపతులకు తాత్కాలిక కుటుంబ పద్ధతులపై సురక్షిత గర్భస్రావాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకమని వీటిని ప్రోత్సహించిన వారు మరియు సహకరించిన వారు శిక్షార్హులని వారిపై క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మానసికంగా, బలహీనంగా ఉండి ఒత్తిడిలో ఉన్నవారు, నిరాధరణకు గురై ఒంటరిగా ఉన్నవారు, ప్రేమ మరియు చదువుల్లో విఫలమైనవారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వీటిని నిరోధించడానికి, మానసిక ధైర్యం కల్పించడానికి తెలంగాణ టెలీ మానస్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 14416 నంబర్పై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ మధు వరుణ్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్లు పాయం శ్రీను, గన్యా, ఇల్లెందు సబ్ యూనిట్ అధికారి హరికృష్ణ, ఆరోగ్య విస్తరణాధికారి దేవా, ఎన్సీడీ కోఆర్డినేటర్ హరి కిషన్, పబ్లిక్ హెల్త్ నర్స్ ఆఫీసర్ చంద్రకళ, సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్, నాగుబండి వెంకటేశ్వర్లు, గుజ్జా విజయ, కౌశల్య సింగ్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.