కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం

Jun 5 2025 7:27 AM | Updated on Jun 5 2025 7:27 AM

కమనీయ

కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం రమణీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

సీజనల్‌ వ్యాధులు

ప్రబలకుండా చర్యలు

భద్రాచలంటౌన్‌: జిల్లాలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్‌ఓ భాస్కర్‌ నాయక్‌ తెలిపారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరికై నా జ్వరం వస్తే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయడంతో పాటు మందులు అందించాలని సిబ్బందికి సూచించారు. మలేరియా నివారణలో భాగంగా ఐఆర్‌ఎస్‌ పిచికారీకి అవసరమైన ఏసీఎంలను జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలకు అందజేశామని చెప్పారు. అనంరతం సిబ్బందికి మలేరియా కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చైతన్య పాల్గొన్నారు.

గర్భిణుల నమోదు తప్పనిసరి

కొత్తగూడెంఅర్బన్‌ : గర్భిణుల వివరాలు ముందస్తుగా నమోదు చేయాలని, సకాలంలో ప్రసవాలు చేసేలా చూడాలని డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్‌ అన్నారు. తన కార్యాలయంలో బుధవారం ఆయన సిబ్బందితో సమావేశం నిర్వహించి ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా నమోదుకు చర్యలు చేపట్టాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఎస్‌.లక్ష్మి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల గర్భిణులను అంచనా వేసిన డెలివరీ తేదీల కంటే ముందుగానే అందుబాటులో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని అన్నారు. అన్ని ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరగాలని, సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. సమావేశంలో వైద్యులు మధువరణ్‌, తేజశ్రీ, పుల్లారెడ్డి, భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

పశువులకు

వ్యాధి నివారణ టీకాలు

పాల్వంచరూరల్‌ : వానాకాలంలో పశువులు, గొర్రెలు, మేకలకు సంక్రమించే వ్యాధుల నివారణకు గత నెల 27 నుంచి ఈనెల 26 వరకు టీకాలు వేస్తున్నట్లు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్‌ ఎం.వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 2.30 లక్షల ఆవులు, గేదెలకు గొంతువాపు, జబ్బవాపు, ముద్దచర్మ వ్యాధి నివారణ టీకాలు, 1.41 లక్షల గొర్రెలు, మేకలకు చిటుకు వ్యాధి నివారణకు ఉచితంగా టీకాలు వేస్తున్నామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సింగరేణిలో 39 మంది అధికారుల బదిలీ

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్న 39 మంది అధికారులను బదిలీ చేస్తూ యాజమాన్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఒక ఏజీఎం, ఏడుగురు డీజీఎంలు, 12 మంది డిప్యూటీ పీఎంలు, 17 మంది సీనియర్‌ పీఓలు, ఇద్దరు సంక్షేమాధికారులు ఉన్నారు.

ముందస్తు వరద హెచ్చరిక

పాల్వంచరూరల్‌: వర్షాలు కురుస్తున్నందున కిన్నెరసాని ప్రాజెక్టు ఎగువ నుంచి వరద ఉధృతి పెరిగితే గేట్లను ఇప్పటి నుంచి వర్షకాలం పూర్తయ్యే నవంబర్‌ వరకు ఎప్పుడైనా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని కిన్నెరసాని ప్రాజెక్టు సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్‌ రామకృష్ణారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరద ఉధృతిని బట్టి గేట్లు ఎప్పుడైనా ఎత్తే అవకాశం ఉంటుందని, వీలైనంత వరకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎత్తి వాగులోకి వరద నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు.

కమనీయం..  రామయ్య నిత్యకల్యాణం1
1/1

కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement