
స్వయం ఉపాధితో ఎదగాలి
భద్రాచలం : ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని గిరిజన మహిళలు ఆర్ధికాభివృద్ధి సాధించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏలోని పీఈటీసీ కాంప్లెక్స్లో గల భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ న్యూట్రీ బిస్కెట్ కేంద్రాన్ని, వైటీసీలోని కుట్టు శిక్షణ కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిస్కెట్ల నాణ్యతతో తయారు చేసి ప్రజలకు అందించాలని సూచించారు. కుట్టు మిషన్ శిక్షణ ఎలా ఉందని మహిళలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలని, మరి కొందరికి సైతం కుట్టు శిక్షణ అందించాలని అన్నారు. బ్లౌజ్, స్కర్ట్ ,యూనిఫామ్, పంజాబీ డ్రెస్, షర్ట్, నిక్కర్, ఫ్రాక్ చుడీదార్ వంటివి కుట్టడంలో పరిణతి చెందితే రాబోయే రోజుల్లో ఎంబ్రాయిడరీ శిక్షణ కూడా అందిస్తామని తెలిపారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు జారీ చేసి, బ్యాంకు ద్వారా ముద్ర రుణాల కింద కుట్టు మిషన్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత గిరిజన యువతకు శిక్షణ అందిస్తున్న హాస్టళ్లు, గదులను పరిశీలించారు. యువత వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా నిష్ణాతులైన వారితో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. అనంతరం పీఎంఆర్సీ భవనంలో రెండో విడత ఉద్దీపకం బుక్లెట్స్ డాటా వివరాలను డీడీ మణెమ్మను అడిగి తెలుసుకొన్నారు. ఐటీడీఏ ప్రాంగణంలో నిర్మిస్తున్న షటిల్ కోర్టు, ఇండోర్ క్రీడా స్థలం పనులను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, ఏసీఎంఓ రమేష్, జేడీఎం హరికృష్ణ, క్రీడల అధికారి గోపాల్రావు, ఎంఎస్ఎంఈ యూనిట్ మహిళలు లలిత, నీలవేణి తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు ఐటీడీఏ పీఓ సూచన