
‘ప్రకృతి’ సాగు దిశగా..
● ఆకాంక్ష పథకంలో జిల్లా ఎంపిక ● మార్గదర్శకాలను విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయశాఖ ● జిల్లాలో 22 క్లస్టర్లలో అమలుకు సన్నాహాలు ● క్లస్టర్కు 125 మంది చొప్పున రైతుల ఎంపిక పూర్తి
సూపర్బజార్(కొత్తగూడెం): రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే జాతీయ మిషన్ ఏర్పాటు చేసింది. భద్రాద్రి ఇప్పటికే ఆకాంక్షిత జిల్లాగా ఎంపిక కావడంతో ప్రకృతి వ్యవసాయ జాతీయ మిషన్ పథకం అమలుకు రాష్ట్ర వ్యవసాయశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి మండలంలో ఒక క్లస్టర్ గ్రామాన్ని ఎంపిక చేసి 125 మంది చొప్పున రైతులను గుర్తించారు. వారి కమతాల్లో తొలుత 125 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తారు.
ఎంపికై న గ్రామాలు ఇవే..
జిల్లాలో భద్రాచలం మినహా మిగిలిన 22 మండలాల్లో క్లస్టర్ గ్రామాలను ఎంపిక చేశారు. ఆళ్లపల్లి, అశ్వాపురం, బూర్గంపాడు, చుంచుపల్లి, గుండాల, జూలూరుపాడు, కరకగూడెం, కొత్తగూడెం, మణుగూరు, పినపాక, సుజాతనగర్, టేకులపల్లి, ఇల్లెందు మండల కేంద్రాలతో పాటు అన్నపురెడ్డిపల్లి మండలం పెద్దిరెడ్డిగూడెం, అశ్వారావుపేట మండలం నారాయణపురం, చండ్రుగొండ మండలం పోకలగూడెం, చర్ల మండలం తేగడ, దమ్మపేట మండలం మామిడాలపల్లి, దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలక, ములకలపల్లి మండలం పొగళ్లపల్లి, పాల్వంచ మండలం యానంబైౖలు గ్రామాలను క్లస్టర్లుగా ఎంపిక చేశారు.
జాతీయ మిషన్ ఎందుకంటే..?
వాతావరణంలో వస్తున్న మార్పులు, పంటలను ఆశిస్తున్న చీడపీడల ఉధృతి, క్షీణిస్తున్న నీటి లభ్యత, పంట ఉత్పత్తుల్లో తగ్గుదలను అధిగమిస్తూ ప్రస్తుతం ఆచరిస్తున్న వ్యవసాయ పద్ధతుల నుంచి క్రమంగా ప్రకృతి వ్యవసాయం వైపు మారేలా కృషి చేసేందుకు కేంద్రం జాతీయ మిషన్ ఏర్పాటు చేసింది.
దశలవారీగా..
మొదటి సంవత్సరంలో రైతులకు శిక్షణ, క్షేత్ర సందర్శన, ఇంటి పెరట్లో గృహావసరాలకు సరిపడా కూరగాయల సాగుతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభింపజేస్తారు. రెండు, మూడో సంవత్సరాల్లో ఆవుపేడ, మూత్రం సేకరించి జీవామృతం వంటి బయో ఉత్పత్తుల తయారీ, మల్చింగ్, అంతర పంటల సాగు పద్ధతులను అవలంబింపజేయడం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన, నమ్మకం ఏర్పడి రైతు తన క్షేత్రంలో కొంత విస్తీర్ణంలో ఆచరణ మొదలు పెట్టేలా చర్యలు చేపడతారు. నాలుగు, ఐదో సంవత్సరాల్లో రైతుల భూమి మొత్తంలో ప్రకృతి వ్యవసాయం ప్రారంభిస్తారు.
నాణ్యమైన పంట ఉత్పత్తుల కోసం..
జిల్లాలో ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్ అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రకృతి వ్యవసాయంతో నాణ్యమైన, అధిక పంట దిగుబడులు వస్తాయి. తద్వారా పంట ఉత్పత్తులకు మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుంది. ప్రజారోగ్యం సంరక్షణకు దోహదపడుతుంది. సాగు ఖర్చులు కూడా తగ్గుతాయి.
–పి.రవికుమార్, అశ్వాపురం ఏడీఏ
ప్రకృతి వ్యవసాయంలో పంచసూత్రాలు..
బీజామృతంతో విత్తన శుద్ధి
నేల ఆరోగ్యం, నీటి యాజమాన్యం
సంవత్సరం మొత్తం నేలను కప్పి ఉంచేలా పంటలతో లేదా వ్యర్థాలతో భూమి ఆచ్చాదన
నేల సూక్ష్మ వాతావరణం, యాజమాన్యం
పంటల ఆరోగ్య యాజమాన్యం
రైతులు సామూహికంగా ఆచరించాల్సిన పద్ధతులు..
నేలలో సేంద్రియ పదార్థాల వృద్ధి
నేలను దున్నకుండా లేదా కనీసస్థాయిలో దున్నడం ద్వారా పంటల సాగు
వైవిధ్యంగా పంటల సాగు
పశుపోషణను పంటల సాగుతో మిళితం చేయడం
ప్రకృతి పద్ధతులతో చీడపీడల యాజమాన్యం
కృత్రిమ రసాయనాల వాడకం నిషేధం
వ్యవసాయ క్షేత్రంలోనే తయారు చేసిన సహజ బయో ఉత్పత్తుల వాడకం
స్థానికంగా రూపొందించిన స్థానిక వాతావరణానికి తగిన పంట విత్తనాలను నాటడం

‘ప్రకృతి’ సాగు దిశగా..