
భూముల రీసర్వేతో రైతులకు మేలు
● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ● ములుగుమాడులో సదస్సు, సర్వేను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి ● పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
ఎర్రుపాలెం: రాష్ట్రప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా భూముల రీసర్వే చేపట్టనుండగా రైతులకు మేలు జరగడమే కాక భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎర్రుపాలెం మండలం ములుగుమాడు గ్రామంలో భూముల రీ సర్వే, భూభారతి సదస్సును మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి మంగళవారం ప్రారంభించారు.
ఎవరిపై భారం పడకుండా సర్వే
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడమే కాక ఎవరికీ రూపాయి కూడా ఖర్చు లేకుండా భూముల రీసర్వే చేసి రికార్డులకు భద్రత కల్పిస్తామని భట్టి, మంత్రులు వెల్లడించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ధరణి చట్టం స్థానంలో భూభారతి తీసుకొచ్చామని తెలిపారు. తద్వారా ప్రతీ భూకమతానికి ఆధార్కార్డు మాదిరి భూధార్ ఇస్తామని చెప్పారు. అంతేకాక ఏటా సదస్సులు నిర్వహించి అమ్మకాల, కొనుగోలు వివరాలను అప్డేట్ చేస్తామని తెలిపారు. భూ సంస్కరణల కారణంగా రాష్ట్రంలో దాదాపు 26లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదలకు పంపిణీ చేస్తే, గత పదేళ్లలో ఎక్కడా కమిటీలు కానరాలేదన్నారు. ఈనేపథ్యాన కొత్త చట్టంతో కమిటీలు ఏర్పాటు చేసి మిగులు భూములను ఇంటి పట్టా లుగా, సాగుకు పంపిణీ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న భూమి కంటే ఎక్కువగా రికార్డుల్లో నమోదు చేయించి రైతుబంధు నిధులు కాజేశారని, ఇలాంటివి ఇక సాగవని స్పష్టం చేశారు. గ్రామ పాలనాధికారులు, లైసెన్సు సర్వేయర్ల నియామకంతో రైతుల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమవుతాయని తెలిపారు.