
గిరిజనుల చెంతకు ‘సంక్షేమం’
● సుదీర్ఘ పోరాటాలతో తెలంగాణ ఏర్పాటు ● రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పీఓ రాహుల్
భద్రాచలం : ఎన్నో ఏళ్ల సుదీర్ఘ పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం అని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ఆవరణలో జరిగిన వేడుకల్లో ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గిరిజనుల చెంతకు పలు సంక్షేమ పథకాలు చేరుతున్నాయని. గిరిజనాభివృద్ధికి విశేష కృషి జరుగుతోందని తెలిపారు. విద్యార్థుల కోసం ఉద్దీపనం వర్క్బుక్లు, వేదిక మ్యాథ్స్ తదతర ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. విద్యతో పాటు క్రీడలకూ పెద్ద పీట వేస్తున్నామని, ఇటీవల ఉట్నూర్లో జరిగిన రాష్ట్రస్థాయి గిరిజన క్రీడా పోటీల్లో భద్రాచలం జోన్ ఓవరాల్ చాంపియన్షిప్ సాధించడమే ఇందుకు నిదర్శనమని వివరించారు. ఇంకా ట్రైకార్, వ్యవసాయ, ట్రైబల్ రిలీఫ్ ఫండ్ ద్వారా కొండరెడ్ల ఆర్ధికాభివృద్ధికి కృషి చేస్తున్నామని, వైద్య రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్నామని తెలిపారు. గిరిజన మ్యూజియంతో వారి సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తున్నామని చెప్పారు. అనంతరం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదివి ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలు అందజేశారు. గురుకులంలో చదివి సత్తుపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సాధించిన అశ్వారావుపేట మండలం తిరుమలకుంటకు చెందిన యాట్ల ధనలక్ష్మికి ల్యాప్టాప్ అందించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, గురుకుల ఆర్సీఓ అరుణకుమారి, ఎస్ఓ భాస్కరన్, వివిధ శాఖల అధికారులు ఉదయ్కుమార్, లక్ష్మీనారాయణ, సున్నం రాంబాబు, మనిధర్, రమేష్, అశోక్ కుమార్, అలివేలు మంగతాయారు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.